ఇక పబ్‌లలో అవి తప్పనిసరి.. వీకెండ్స్‌లోనూ అప్పటివరకే అనుమతి

by Dishafeatures2 |
ఇక పబ్‌లలో అవి తప్పనిసరి.. వీకెండ్స్‌లోనూ అప్పటివరకే అనుమతి
X

దిశ, తెలంగాణ బ్యూరో : నగరంలో నడుస్తున్న పబ్‌లకు, ఇకపైన కొత్తగా ఉనికిలోకి వచ్చేవాటికి సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం కంపల్సరీ అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్ స్పష్టం చేశారు. వాటిని ఎక్సైజ్ శాఖకు అనుసంధానం చేయాలని, ఆ కెమెరాల ఫుటేజీ రియల్ టైమ్‌లో ఎక్సైజ్ శాఖ సెర్వర్లకు కనెక్ట్ అయి ఉండాలని పేర్కొన్నారు. నగరంలో ప్రస్తుతం 61 పబ్‌లు ఉన్నాయని, వాటిలో కొన్నింటికి సీసీ టీవీలు ఇప్పటికే ఉన్నాయని, లేని పబ్‌లు నెల రోజుల వ్యవధిలో ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. సీసీటీవీ కెమెరాలు లేనట్లయితే వాటి అనుమతులను రద్దు చేసి సీజ్ చేస్తామని హెచ్చరించారు. శని, ఆదివారాల్లోఅర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే పబ్‌లు తెరిచి ఉండాలని, ఆ తర్వాత మూసివేయాల్సిందేనని నొక్కిచెప్పారు.

కేవలం 24 గంటలూ పనిచేయడానికి లైసెన్సు తీసుకున్న పబ్‌లలో మాత్రమే అర్ధరాత్రి తర్వాత కూడా సర్వీసు ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవల పుడింగ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ వాడుతున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో యజమానులతో శనివారం నిర్వహించిన సమీక్ష సందర్భంగా మంత్రి పై క్లారిటీ ఇచ్చారు. సీసీటీవీ కెమెరాల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నదని, నిబంధనలకు విరుద్ధంగా నడిస్తే వాటి పట్ల కఠినంగా వ్యవహరించక తప్పదని హెచ్చరించారు. పబ్‌లు నిజాయితీగా వ్యవహరిస్తే ఎలాంటి సమస్యా లేదని, కానీ ఉల్లంఘనలకు పాల్పడితే ఉపేక్షించేదే లేదన్నారు. ఇందుకోసం ఇకపైన స్పెషల్ డ్రైవ్‌లు చేపడతామన్నారు.


హైదరాబాద్ నగరం పారిశ్రామికంగా, ఐటీ పరిశ్రమల పరంగా అభివృద్ధి చెందుతుండడంతో విదేశీయులు వస్తున్నారని, వారి సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని పబ్‌లకు ప్ర అభుత్వంనుమతి ఇచ్చిందని, డ్రగ్స్ లాంటివి విక్రయిస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి, నగరానికి చెడ్డ పేరు వస్తూ ఉంటే ప్రభుత్వం మౌనంగా ఉండబోదని, మూసేయడానికి వెనుకాడబోదని పేర్కొన్నారు. డ్రగ్స్ వెనుక ఏ స్థాయి వ్యక్తులున్నా వదలొద్దంటూ స్వయంగా ముఖ్యమంత్రే క్లారిటీ ఇచ్చారని గుర్తు చేశారు. పబ్‌ల ద్వారా ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం కూడా రావడంలేదని, కొద్దిమందికి ఉపాధి అవకాశాలు మాత్రం లభిస్తున్నాయని, ఈ కారణంగానే లైసెన్సుల విషయంలో ప్రభుత్వం పాజిటివ్ మైండ్‌తో ఆలోచిస్తున్నదన్నారు.



Next Story

Most Viewed