స్నేహితుడి భార్యపై కన్నేసిన మిత్రుడు.. రోజూ అలా చేస్తుండటంతో తట్టుకోలేని ఆమె..

by Disha Web Desk |
స్నేహితుడి భార్యపై కన్నేసిన మిత్రుడు.. రోజూ అలా చేస్తుండటంతో తట్టుకోలేని ఆమె..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆ ఇంట్లో పుట్టిన వ్యక్తి కాకపోయినా.. ఆ ఇంటి మనిషిగానే చలామణి అయ్యాడు. ఇంట్లో అందరితో ఆత్మీయబంధం పెనవేసుకున్నాడు ఆ యువకుడు. చిన్నప్పటి నుంచి ఆ ఇంటి కుమారుడితో స్నేహం చేస్తూ రెండో కొడుకులా మెదిలాడు. ఆ ఇంటితో అంతటి చనువు, సాన్నిహిత్యం ఉన్న అతడు.. తన స్నేహితుడిపై భార్యపై కన్నేశాడు. ఆమె తన సోదరిడిలా భావిస్తూ.. అన్నా అని పిలిచినా ఆ కామాంధుడు మనసు మారలేదు. నిత్యం ఇంటికి వస్తూ సమయం దొరికితే చాలు.. ఆమెను ఆక్రమించడానికి ప్రయత్నాలు చేసేవాడు. ఆమె ఎంత సర్ధి చెప్పినా పట్టించుకోలేదు. చివరకు 'పరువు' కాపాడుకోడానికి రెండు శవాలు లేశాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన వివాహితకు (24) కొన్నాళ్ల క్రితం వివాహం అయింది. భర్త, అత్తామామలతో కలిసి జీవిస్తున్న ఆమెకు అదే గ్రామానికి చెందిన భర్త స్నేహితుడు మోటపల్కుల ప్రశాంత్ (28) నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంది. ఆమెకు పెళ్లి అయినప్పటి నుంచి అతడు భర్త కోసం ఇంటికి వస్తూ తరచూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేసేవాడు. ప్రశాంత్‌ను ఆమె అన్నా అని పిలిచినా.. పట్టించుకోలేదు. ఇంట్లో కుటుంబ సభ్యులతో అతడికి చనువు బాగా ఉండటం, భర్తకు ప్రాణ స్నేహితుడు కావడంతో ఆమె ఎవరికీ చెప్పుకోలేక అతడి వేధింపులను మౌనంగా భరించింది.

ఆమె మౌనాన్ని అలుసుగా తీసుకున్న ప్రశాంత్ ఫ్రెండ్ భార్యపై లైంగిక దాడి చేయడానికి విశ్వప్రయత్నం చేశాడు. దీంతో ఎప్పటికైనా అతడికి బలి అవుతానని భావించిన వివాహిత ఈ నెల 5న ఇంట్లో అందరూ ఉండగానే పురుగుల మందు తాగింది. ఆమె వాంతులు చేసుకుంటుండగా గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే లక్షెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఆమెను కరీంనగర్ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, అక్కడ ఆమె ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసిందో కుటుంబ సభ్యులకు, పోలీసులకు వివరించింది. ప్రకాంత్ అకృత్యాలను, వేధింపులను చెప్పింది. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందింది.

వివాహిత మృతి చెందడంతో ఆమె తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రశాంత్.. ఊళ్లో తన పరువు పోతుందని, తలెత్తుకొని తిరగలేనని, ఫ్రెండ్ కుటుంబానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆమె చనిపోయిన కొద్ది సేపటికే రామగుండం దగ్గర రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, వివాహితకు ఇద్దరు చిన్నారులు ఉండగా.. ప్రశాంత్‌కు ఏడాదిన్నర పాప ఉన్నది. ఇద్దరి మృతిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story