ఆంధ్రా ప్రీమియర్ లీగ్.. విద్యార్థులకు ప్రవేశం ఉచితం

by Muthe.Rajitha |

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) విద్యార్థులకు గుడ్ న్యూస్ చెబుతూ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ACA) కీలక ప్రకటన చేసింది.

ఆంధ్రా ప్రీమియర్ లీగ్.. విద్యార్థులకు ప్రవేశం ఉచితం
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) విద్యార్థులకు గుడ్ న్యూస్ చెబుతూ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ACA) కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఏపీఎల్ పోటీలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. గత ఏడాది ఈ టోర్నీ మ్యాచ్‌లన్నీ కేవలం విశాఖపట్నానికే పరిమితం కాగా, ఈసారి మాత్రం వైజాగ్‌తో పాటు కడప, మంగళగిరి వేదికల్లోనూ మ్యాచ్‌లను నిర్వహించబోతున్నట్లు ACA వెల్లడించింది.

ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో మొత్తం 7 జట్లు తలపడనుండగా, మ్యాచ్‌లను మూడు దశల్లో నిర్వహించనున్నారు. లీగ్ ప్రారంభ మ్యాచ్ విశాఖపట్నం వేదికగా మొదలవుతుందని, ఆ తర్వాత మొదటి దశ మ్యాచ్‌లన్నీ వైజాగ్‌లోనే జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. రెండో దశ మ్యాచ్‌లకు రాయలసీమ కేంద్రమైన కడప ఆతిథ్యం ఇవ్వనుండగా, అత్యంత కీలకమైన చివరి దశ మ్యాచ్‌లతో పాటు ఈ నెల 30న జరిగే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌ను మంగళగిరిలో నిర్వహించనున్నారు. ఈ టోర్నీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ, పట్టణ ప్రాంత క్రీడాకారుల దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి ఉన్నత స్థాయి వేదికను కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఏసీఏ ప్రతినిధులు స్పష్టం చేశారు.

క్రికెట్ అభిమానులను, ముఖ్యంగా యువతను స్టేడియాల వైపు ఆకర్షించేందుకు ఏసీఏ పలు ఆకర్షణీయమైన నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులకు క్రికెట్ మ్యాచ్‌లను లైవ్‌గా చూసే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తూ విద్యార్థులకు ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో పాటు, ఈ లీగ్‌పై ప్రజల్లో మరింత ఆసక్తిని, అవగాహనను పెంచడానికి మ్యాచ్‌లు జరిగే మూడు ప్రధాన ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏపీఎల్ ఫ్లాష్‌మాబ్‌లను కూడా నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సరికొత్త మార్పులతో ఈ ఏడాది ఏపీఎల్ సరికొత్త జోష్‌తో సాగనుంది.

Next Story