ప్ర‌పంచ న‌గ‌రాల‌తో హైద‌రాబాద్ పోటీ

by Taduka Kalyani |

న్యూయ‌ర్, టోక్యో న‌గ‌రాల‌తో స‌మానంగా హైద‌రాబాద్‌ను అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్న‌ట్లు తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు.

ప్ర‌పంచ న‌గ‌రాల‌తో హైద‌రాబాద్ పోటీ
X

దిశ, మేడ్చల్ బ్యూరో : న్యూయ‌ర్, టోక్యో న‌గ‌రాల‌తో స‌మానంగా హైద‌రాబాద్‌ను అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్న‌ట్లు తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం మ‌ల్కాజ్‌గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో రూ. 1511 కోట్ల అభివృద్ది పనుల‌కు ఉప్ప‌ల్ భ‌గాయ‌త్ లేఅవుట్ ఫేజ్ -3 వేదిక‌గా శంకుస్థాప‌న చేశారు. అలాగే ఈ వేదిక‌గా మీది నుంచే క్యూర్ - 1 యాప్ ను ప్రారంభించారు. ఈ శంకుస్థాప‌న‌ల్లో ప్ర‌ధానంగా -ఏఓసీ సెంటర్ చుట్టూ రూ. 960 కోట్ల‌తో ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణం, టీకేఆర్ కాలేజ్ జంక్షన్ – గాయత్రినగర్ జంక్షన్ – మందా మల్లమ్మ జంక్షన్‌ల వద్ద రూ. 416 కోట్ల‌తో 6 లేన్ ద్విముఖ ఫ్లైఓవర్ నిర్మాణం, ఉప్పల్ భగాయత్ లేఅవుట్ ఫేజ్-3లో రూ.98 కోట్ల‌తో నూతన మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ‌తంలో ఓఆర్ఆర్ లోప‌ల ఎక్క‌డ చూసిన 4 ర‌కాలుగా ప‌రిపాల‌న జ‌ర‌గ‌డం వ‌ల్ల‌ ఒక‌రికి ఒక‌రికి స‌మ‌న్వ‌యం లేక ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. అందుకే అన్ని శాఖ‌ల‌ను స‌మ‌న్వ‌యం చేసేందుకు శ‌ర‌వేగంగా అభివృద్ది చేసేందుకు న‌గ‌రాన్ని 3 మున్సిప‌ల్ కార్పొరేష‌న్లుగా ప‌రిపాల‌న‌ను వికేంద్రీక‌రించిన‌ట్లు వివ‌రించారు. ఒక కోటి 34 ల‌క్ష‌ల మంది జ‌నాభా ఓఆర్ఆర్ లోప‌ల నివ‌సిస్తున్నార‌ని అందుకే ప‌రిపాల‌న ప్ర‌క్షాళ‌న కోసం 3 కార్పొరేష‌న్లు ఏర్పాట్లు చేసిన‌ట్లు చెప్పారు. ఇది ఎన్నిక‌ల ల‌భ్ది కోసం కాదు ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసమేన‌ని స్ప‌ష్టంచేశారు. హైద‌రాబాద్ ను అంత‌ర్జాతీయ న‌గ‌రం అని చెప్పుకోవ‌డం కాదు హైద‌రాబాద్‌ను అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో మౌళిక స‌దుపాయాల‌ను అభివృద్ధి చేసిన‌ప్పుడే అంత‌ర్జాతీయ న‌గ‌రంగా చెప్పుకోవాల‌ని అన్నారు. అందుకే రైజింగ్ 2047 అనే నినాదంతో తెలంగాణతో పాటు హైద‌రాబాద్‌ను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క‌సారి ఎంఎంసీ, జీహెచ్ఎంసీ, సీఎంసీ, ప్ర‌జ‌ల‌తో మాట్లాడండి. ప‌రిపాల‌న సుల‌భ‌మైందో లేదో చెబుతారని అభివృద్ధి వేగంగా జ‌రుగుతుందో లేదో చెబుతార‌ని వివ‌రించారు.

మ‌ల్కాజ్‌గిరి ప్రాంత అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నాం

అందులో భాగంగానే10 ఎక‌రాల విస్తీర్ణంలో ఉప్ప‌ల్ భ‌గాయ‌త్ లో ఎంఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యం భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాప‌న చేసిన‌ట్లు తెలిపారు. అలాగే అద‌నంగా 1600 కోట్ల ప‌నుల ప్రారంభోత్స‌వం చేసుకున్నామ‌ని చెప్పారు. ప‌రిపాల‌న వికేంద్రిక‌ర‌ణ కోసం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ కు ఎంత ప‌రిధి ఉందో అంతే ప‌రిధిలో పోలీసుల క‌మిష‌న‌రేట్ చేశామ‌న్నారు. దీంతో అన్ని శాఖ‌లు స‌మ‌న్వ‌యంలో ఇబ్బందులు ఉండ‌వ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఈ ప్రాంత అభివృద్ది కోసం ఎన్ని నిధులు కావాల‌న్న ఇచ్చే బాధ్య‌త త‌న‌ద‌ని... నిధులు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం సిద్దంగా ఉందని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రైతే మంచి చేస్తారో మంచిని మంచి అని గుర్తించాలన్నారు. అందుకే ఉప్ప‌ల్ ఎలివేట్ కారిడార్ కు బండారి రాజిరెడ్డి పెట్ట‌డం జ‌రిగిందని తెలిపారు. పార్టీలకు అతీతంగా మ‌నం ముందుకు సాగుతున్నామ‌న్నారు. మూసీ ప్ర‌క్షాళ‌న జ‌రిగితే విదేశాల‌తో పోటీ ప‌డుతామ‌ని టూరిజం పెరిగి ఆర్ధిక వ‌న‌రులు స‌మ‌కురుతాయ‌న్నారు. అందుకే నాగోల్ నుంచి గౌరెల్లి వ‌ర‌కు ఫేజ్-2 100 రోజుల్లో ప్రారంభిస్తామ‌ని తెలిపారు. ఎలివేటేడ్ కారిడార్‌, ఈ ప్రాంత బాధ్య‌త‌లు తీసుకుంటామ‌న్నారు. మూసీని ప్రక్షాళ‌న చేసి అభివృద్దికి బాట‌లు వేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.ఈ స‌మావేశానికి పెద్ద ఎత్తున స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌లు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు , దామోద‌ర రాజ‌న‌ర్సింహా , ఎంపీలు వేం నరేందర్ రెడ్డి,అనిల్ కుమార్ యాదవ్ , చామ‌కూర కిర‌ణ్ కుమార్ రెడ్డి ,ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ,ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, శ్రీ గణేష్,మల్ రెడ్డి రంగారెడ్డి,ఎంఎయూడీ స్పెష‌ల్ చీఫ్ సెక్రెట‌రీ .జ‌యేష్ రంజ‌న్ ఎంఎంసి క‌మిష‌న‌ర్ విన‌య్ కృష్ణా రెడ్డి , కలెక్టర్ మను చౌదరిజిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Next Story