ఒక్క రోజులో పాస్‌పోర్టు ఇప్పిస్తామంటూ మోసం

by Batti.Sumithra |

పాస్‌పోర్టును ఒక్క రోజులో ఇప్పిస్తామని నమ్మించి మోసానికి పాల్పడిన కేసులో నలుగురిని సోమవారం ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు.

ఒక్క రోజులో పాస్‌పోర్టు ఇప్పిస్తామంటూ మోసం
X

దిశ, సిటీ క్రైమ్ : పాస్‌పోర్టును ఒక్క రోజులో ఇప్పిస్తామని నమ్మించి మోసానికి పాల్పడిన కేసులో నలుగురిని సోమవారం ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన షాహీన్ బేగం సుల్తానా తన మనవడి పాస్‌పోర్టు కోసం గత ఏడాది జూన్ నెలలో సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయంలో దరఖాస్తు చేశారు. దరఖాస్తు పెండింగ్‌లో ఉండటంతో వివరాలు తెలుసుకునేందుకు నవంబర్‌లో మరోసారి పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా షాహీన్ బేగం సుల్తానాను శివరాత్రి సిద్ధులు, అతని అనుచరులు సంప్రదించి, ఒక్క రోజులో పాస్‌పోర్టు ఇప్పిస్తామని నమ్మబలికి రూ.6 వేలును తీసుకున్నారు.

తాజాగా జూన్ 4న పాస్‌పోర్టు విషయమై సిద్ధులును సంప్రదించగా, మరికొంత డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. అదనపు డబ్బు ఇవ్వకపోతే పాస్‌పోర్టు ప్రక్రియను నిలిపివేస్తామని బెదిరించాడు. దీంతో బాధితురాలు మార్కెట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు, ఎస్‌ఓటీ పోలీసుల సహకారంతో పాస్‌పోర్టు బ్రోకర్ శివరాత్రి సిద్ధులు, తుమ్మల వెంకటేష్, వరికుప్పల అశ్విన్ కుమార్, పల్లేపు దీపక్‌లను అరెస్టు చేశారు. పాస్‌పోర్టు సంబంధిత వ్యవహారాల కోసం మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దని పోలీసులు సూచించారు. పాస్‌పోర్టు సేవల కోసం అధికారిక పాస్‌పోర్టు కేంద్రాలు, అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే సంప్రదించాలని ప్రజలకు సూచించారు.

Next Story