2022 లో రూ. లక్ష కోట్ల మార్కు దాటిన ఎఫ్‌పీఐల ఉపసంహరణ!

by Disha Web Desk 17 |
2022 లో రూ. లక్ష కోట్ల మార్కు దాటిన ఎఫ్‌పీఐల ఉపసంహరణ!
X

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణ ఆందోళనలు, అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా విదేశీ పెట్టుబడిదారులు ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ. 1.14 లక్షల కోట్లను వెనక్కి తీసుకెళ్లారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం.. ప్రస్తుత నెలలోనే ఇప్పటివరకు రూ. 48,262 కోట్ల విలువైన ఈక్విటీలను విదేశీ ఇన్వెస్టర్లు విక్రయించారు. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐల నిధుల ఉపసంహరణ భారీగా రూ. 1,14,856 కోట్లకు చేరుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరగడంతో పాటు గ్లోబల్ మార్కెట్లో ప్రతికూలత కారణంగానే విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు(ఎఫ్‌పీఐ) నిధులను ఉపసంహరించుకుంటున్నారని నిపుణులు అభిప్రాయపడ్డారు.

దీంతో భారత స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు తమ నిధులను వెనక్కి తీసుకెళ్లడం ఇది వరుసగా ఆరో నెల కావడం గమనార్హం. ముఖ్యంగా ముడి చమురుకు సంబంధించి కీలక దిగుమతిదారుగా ఉన్న భారత్‌లో వీటి దిగుమతులు క్షీణించడం, వస్తువుల ధరలు పెరగనున్నాయనే సంకేతాలు ఎఫ్‌పీఐలపై మరింత ప్రభావం పడుతుందనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాగా, గణాంకాల ప్రకారం.. విదేశీ పెట్టుబడిదారులు ఈ ఏడాది జనవరిలో ఈక్విటీ మార్కెట్ల నుంచి మొత్తం రూ. 28,526 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 38,068 కోట్లు, మార్చిలో ఇప్పటివరకు రూ. 48,261 కోట్లను ఉపసంహరించుకున్నారు.


Next Story

Most Viewed