బిగ్ బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

by Disha Web Desk 2 |
బిగ్ బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
X

దిశ, చారగొండ : నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం తుర్కపల్లి గ్రామ సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. చారగొండ ఎస్ఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రానికి చెందిన గౌస్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కారులో ప్రసిద్ధిగాంచిన కడప జిల్లా కేంద్రంలోని హజ్రత్ అమీర్ పిరాన్ దర్గా దర్శనానికి రెండ్రోజుల క్రితం వెళ్లారు. శుక్రవారం రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు. శనివారం ఉదయం వేగంగా వస్తున్న కారు చారగొండ మండలం, తుర్కలపల్లి గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ దిమ్మను బలంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో గౌస్ ఖాన్(55), అతని భార్య ఫర్హాన (45), సోదరి సాధిక బేగం(55), అల్లుడు రోషన్(22) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కుమారుడు ఇంతియాజ్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్ తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.






Next Story