అస్సాం కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ.. ఎన్నికల వేళ మాజీ పీసీసీ చీఫ్ భూపేన్ బోరా రాజీనామా!

by Malleboina Mahesh |

అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత భూపేన్ కుమార్ బోరా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

అస్సాం కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ.. ఎన్నికల వేళ మాజీ పీసీసీ చీఫ్ భూపేన్ బోరా రాజీనామా!
X

దిశ, వెబ్ డెస్క్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Assam Pradesh Congress Committee) మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత భూపేన్ కుమార్ బోరా (Bhupen Kumar Bora) పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఉదయం 8 గంటలకు రాజీనామా చేస్తూ లేక పంపానని అందులో పూర్తి వివరాలు పొందుపరిచానని చెప్పుకొచ్చారు. ఎన్నికల ముంగిట కీలక వ్యూహకర్తగా ఉన్న నాయకుడు ఇలా అర్థాంతరంగా వైదొలగడం అస్సాంలో కాంగ్రెస్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది.

తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge)కు పంపిన బోరా, అందులో పార్టీ అధిష్టానం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా పార్టీ నాయకత్వం తనను పూర్తిగా "నిర్లక్ష్యం" చేస్తోందని, రాష్ట్ర స్థాయిలో తనకు దక్కాల్సిన కనీస గౌరవం, ప్రాధాన్యత లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2021 నుంచి 2025 వరకు అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన తనకు, గత ఏడాది గౌరవ్ గొగోయ్‌ను ఆ పదవిలో నియమించినప్పటి నుండి ప్రాధాన్యత తగ్గడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

రెండు సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉన్న భూపేన్ బోరా రాజీనామా (resignation), అస్సాం కాంగ్రెస్ కేడర్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీని ఐక్యం చేయాల్సిన సమయంలో, మాజీ అధ్యక్షుడే ప్రాధాన్యత లేదనే కారణంతో బయటకు వెళ్లడం ప్రత్యర్థి పార్టీలకు బలమైన అస్త్రంగా మారనుంది. ఈ పరిణామం అస్సాం రాజకీయాల్లో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా (Big Shock) విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఆయన బీజేపీలో చేరతారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇదే నిజమైతే కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story