కేజీబీవీలో మరోసారి ఫుడ్ పాయిజన్.. మూడు రోజుల్లోనే మూడో ఘటన..

by Disha Web Desk 19 |
కేజీబీవీలో మరోసారి ఫుడ్ పాయిజన్.. మూడు రోజుల్లోనే మూడో ఘటన..
X

దిశ, ఆదిలాబాద్: కేజీబీవీ, వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చోటు చేసుకుంటున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా శనివారం భీంపూర్ మండలం కేజీబీవీ హాస్టల్లో సుమారు 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. గత మూడు రోజుల క్రితమే జిల్లాలోని రూరల్ మండలం కస్తూర్బా గాంధీ పాఠశాల, తాంసి మండలంలోని గోటూరు పాఠశాలలో కలుషిత ఆహార ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనల్లో చికిత్స పొంది డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిన విద్యార్థులు తేరుకోకముందే.. తాజాగా.. జిల్లా కేంద్రంలో ఉన్న భీంపూర్ మండలం కస్తూర్బా గాంధీ పాఠశాలలో శుక్రవారం రాత్రి 70 మంది విద్యార్థులు వాంతులు, విరోచనాలతో బాధ పడ్డారు. హాస్టల్లో ప్రాథమిక చికిత్స అందించగా.. 30 మంది విద్యార్థుల ఆరోగ్యం కుదుటపడింది. మరో 40 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురి కాగా.. శనివారము ఉదయము సిబ్బంది హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్‌లు రిమ్స్‌కు చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కేజీబీవీ హాస్టల్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు.

Next Story

Most Viewed