లా అండ్‌ ఆర్డర్‌ కంటే.. ల్యాండ్‌ సెటిల్‌మెంట్లపై ఫోకస్‌: ఓ కమిషనర్‌పై మధుయాష్కీ ఆరోపణలు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో పోలీసు అధికారుల పనితీరుపై సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ (Madhuyashki Goud) తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

లా అండ్‌ ఆర్డర్‌ కంటే.. ల్యాండ్‌ సెటిల్‌మెంట్లపై ఫోకస్‌: ఓ కమిషనర్‌పై మధుయాష్కీ ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పోలీసు అధికారుల పనితీరుపై సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ (Madhuyashki Goud) తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఇవాళ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కొందరు అధికారులు ఇంకా పాత ప్రభుత్వ అలవాట్లను వదులుకోలేదన్నారు. వారి తీరు వల్ల ప్రస్తుత ప్రజా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఆరోపించారు. ఒక కీలక కమిషనర్ లా అండ్ ఆర్డర్‌ను పర్యవేక్షించడం మానేసి, కేవలం భూ వివాదాలు, ల్యాండ్ సెటిల్‌మెంట్లపైనే స్పెషల్‌గా ఫోకస్ పెట్టారంటూ సంచలన ఆరోపణ చేశారు.

మరికొందరు అధికారులు నిజాయితీగా పనిచేయడం అటుంచితే వార్తల్లో నిలవడానికి, పబ్లిసిటీ కోసం మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని మధుయాష్కీ విమర్శించారు. ఏ కాంగ్రెస్ సీఎం కూడా అర్ధరాత్రి వేళల్లో అరెస్టులు చేయమని ఆదేశించరని, పోలీసులు అత్యుత్సాహంతో ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు అధికారులు, ఇప్పటికీ అదే పంథాను కొనసాగిస్తున్నారని, వారిని వెంటనే పక్కన పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం నడుస్తోందని.. ఇక్కడ చట్టం తన పని తాను చేయాలి తప్ప, వ్యక్తుల ప్రయోజనాల కోసం లేదా పబ్లిసిటీ కోసం పనిచేయకూడదని మధుయాష్కీ చురకలంటించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలతో పాటు పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Next Story