డంపర్ ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఐదుగురు దుర్మరణం

by Malleboina Mahesh |

మోర్బీ-హల్వాద్ హైవేపై శుక్రవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో కారు, డంపర్ ట్రక్కును ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు.

డంపర్ ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఐదుగురు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: వేగంగా వెళ్తున్న ఓ కారు డంపర్ ట్రక్కును ఢీకొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీ జిల్లాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. హైవేపై వేగంగా వెళ్తున్న ఒక కారు, రోడ్డు దాటుతున్న డంపర్ ట్రక్కును బలంగా ఢీ కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ భీకర ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.

హల్వాద్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మోర్బీ-హల్వాద్ హైవేపై ఉన్న చరద్వా గ్రామం సమీపంలో శుక్రవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఒక డంపర్ ట్రక్కు రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన కారు దానిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నలిగిపోయింది. కారు లోపల చిక్కుకుపోయిన క్షతగాత్రులను, మృతదేహాలను బయటకు తీయడానికి భారీ ఎక్స్‌కవేటర్ (జేసీబీ) మిషన్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. శ్రమించి బాధితులను బయటకు తీసిన అనంతరం, గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story