- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి నుంచి తొలి దశ గృహ గణన
దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో భాగంగా దిల్లీ, గోవా, కర్ణాటక, మిజోరాం, ఒడిశా, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఏప్రిల్ 16 నుంచి క్షేత్రస్థాయిలో గృహ గణన ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో, ఇప్పుడు ఎన్యూమరేటర్లు మే 15 వరకు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించనున్నారు. స్వయంగా నమోదు చేసుకున్న వారి వివరాలను కూడా వారు నిర్ధారించనున్నారు. తొలిసారిగా ప్రవేశపెట్టిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, సుమారు 12 లక్షల గృహాలు అధికారిక పోర్టల్ ద్వారా నమోదు అయినట్లు కేంద్రం వెల్లడించింది.
ఇక మరోవైపు, నేటి నుంచి ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హరియాణా, చండీగఢ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 30 వరకు ఈ ఆరు రాష్ట్రాల్లో పోర్టల్ అందుబాటులో ఉండనుంది. అనంతరం మే 1 నుంచి మే 30 వరకు హౌస్ లిస్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అదేవిధంగా, బిహార్ రాష్ట్రంలో ఈ ప్రక్రియ ఏప్రిల్ 17 నుంచి ప్రారంభమై మే 1 వరకు కొనసాగనుంది. దేశవ్యాప్తంగా దశలవారీగా జనగణన నిర్వహించేందుకు కేంద్రం కార్యాచరణ రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈసారి డిజిటల్ పద్ధతులను విస్తృతంగా వినియోగిస్తూ జనగణనను మరింత పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.






