లోకేశ్వరంలో ఎరువుల దందా.. రైతుల ఫిర్యాదుతో కలెక్టర్ సీరియస్ !

by Batti.Sumithra |

లోకేశ్వరం మండలంలోని పలువురు ఎరువులు, విత్తనాల దుకాణాల నిర్వాహకులు అధిక ధరలకు రసాయన ఎరువులను విక్రయిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని పలువురు రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

లోకేశ్వరంలో ఎరువుల దందా.. రైతుల ఫిర్యాదుతో కలెక్టర్ సీరియస్ !
X

దిశ, లోకేశ్వరం : లోకేశ్వరం మండలంలోని పలువురు ఎరువులు, విత్తనాల దుకాణాల నిర్వాహకులు అధిక ధరలకు రసాయన ఎరువులను విక్రయిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని పలువురు రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మంగళవారం లోకేశ్వరం మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్ దృష్టికి రైతులు ఈ విషయాన్ని తీసుకువచ్చారు. డీఏపీ బస్తాపై రూ.300 నుంచి రూ.400 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని, అలాగే అవసరం లేని పురుగుమందులను లింకుల రూపంలో అంటగడుతున్నారని రైతులు కలెక్టర్‌కు వివరించారు.

దీని పై వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్‌ను కలెక్టర్ ఆదేశించారు. అలాగే నానో యూరియా వాడకం పై రైతులకు అవగాహన కల్పిస్తే యూరియా బస్తాల వినియోగం తగ్గుతుందని రైతులు కోరగా, వెంటనే ఆయా గ్రామాల్లో నానో యూరియా వినియోగం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీఏఓకు సూచించారు. మరోవైపు, మొక్కజొన్న విక్రయించి నెల రోజులు గడిచినా తమ ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీని పై కలెక్టర్ వెంటనే మార్క్‌ఫెడ్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. వారం రోజులలోపు మొక్కజొన్న విక్రయాల డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు చేపడతామని మార్క్‌ఫెడ్ అధికారులు కలెక్టర్‌కు తెలిపారు.

Next Story