- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిషన్ భగీరథపై 12,457 మంది సర్పంచుల నుంచి ఫీడ్బ్యాక్ సేకరణ
తెలంగాణలో తాగునీటి సమస్యల పరిష్కారానికి మంత్రి సీతక్క యాక్షన్ ప్లాన్! 12 వేల మందికి పైగా సర్పంచుల ఫీడ్బ్యాక్ ఆధారంగా ఏప్రిల్ 15 లోపు సమస్యలు తీర్చాలని ఆదేశం.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గ్రామ స్థాయి సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా తాగునీటి సరఫరా మెరుగుపరచడానికి సర్పంచుల అభిప్రాయాలే ప్రభుత్వానికి అసలైన మార్గదర్శకమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు మిషన్ భగీరథ ఇంజనీర్-ఇన్-చీఫ్ కార్యాలయం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర ఫీడ్బ్యాక్ సేకరణపై శనివారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
16 కీలక అంశాలపై ఆరా..
గత పది రోజులుగా సాగిన ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు గానూ, 12,457 మంది సర్పంచులతో అధికారులు నేరుగా ఫోన్ ద్వారా మాట్లాడారు. నీటి నాణ్యత, క్లోరినేషన్, ట్యాంకుల శుభ్రత, పైపులైన్ లీకేజీలు, పంపుల పనితీరు, ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ వంటి 16 కీలక అంశాలపై వారి అభిప్రాయాలను సేకరించారు. మెజారిటీ సర్పంచులు తాగునీటి సరఫరాపై సంతృప్తి వ్యక్తం చేయడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
సర్పంచులు గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, మిషన్ భగీరథ అధికారులు గ్రామాలకు వెళ్లి పరిశీలించి, 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 2026 ఏప్రిల్ 1 నుంచి 15 లోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. మిషన్ భగీరథ వ్యవస్థ లేని మారుమూల గ్రామాల్లో ప్రజల అవసరాల మేరకు ఓపెన్ వెల్స్ తవ్వించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల్లో భాగంగా వర్షాకాలానికి ముందే చెక్డ్యాంలు నిర్మించాలని మంత్రి సూచించారు. “స్థానిక నీటి వనరులను బలోపేతం చేయడం ద్వారా దీర్ఘకాలికంగా నీటి లభ్యత పెరుగుతుంది” అని పేర్కొన్నారు.
టోల్ ఫ్రీ నెంబర్ 1916 వినియోగించుకోవాలి..
తాగునీటి సమస్యలపై ఎవరైనా టోల్ ఫ్రీ నెంబర్ 1916 కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గత వేసవిలో ఎలాంటి తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకున్నట్లే, ఈ వేసవిలో కూడా మిషన్ భగీరథ ఇంజనీర్లు నిరంతర పర్యవేక్షణతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. సమస్యాత్మక గ్రామాలు, అటవీ ప్రాంతాలు, ఆదివాసీ గూడాలు, లంబాడీ తాండాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. వార్తా పత్రికలు, సోషల్ మీడియాలో తాగునీటి సరఫరాపై వచ్చే ప్రతి సమాచారం పట్ల వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని మంత్రి సీతక్క మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.






