నకిలీ ఎరువుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండండి:మండల వ్యవసాయ అధికారి

by Jakkula.Mamatha |

నకిలీ ఎరువుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉప్పునుంతల మండల వ్యవసాయ అధికారి కొర్ర రమేష్ గురువారం రైతులను అప్రమత్తం చేశారు.

నకిలీ ఎరువుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండండి:మండల వ్యవసాయ అధికారి
X

దిశ, ఉప్పునుంతల: నకిలీ ఎరువుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉప్పునుంతల మండల వ్యవసాయ అధికారి కొర్ర రమేష్ గురువారం రైతులను అప్రమత్తం చేశారు. వర్షాకాల పంటల సాగు నేపథ్యంలో కొందరు వ్యక్తులు వ్యవసాయ శాఖ అనుమతి(లైసెన్స్) లేకుండా గ్రామాల్లో రోడ్డు పక్కన, తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి నకిలీ లేదా నాణ్యత లేని ఎరువులను విక్రయించే అవకాశం ఉందని ఇటువంటి వారి వద్ద ఎరువులు కొనుగోలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. రైతులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాఖ లైసెన్స్ కలిగిన ఎరువుల దుకాణాల నుంచే ఎరువులు కొనుగోలు చేయాలని ప్రతి కొనుగోలుకు తప్పనిసరిగా జీఎస్టీ బిల్లు/క్యాష్ మెమో తీసుకుని భద్రపరుచుకోవాలని సూచించారు.

అలాగే ఎరువుల సంచి పై తయారీ సంస్థ పేరు, బ్యాచ్ నెంబర్, తయారీ, గడువు తేదీ, నికర బరువు మరియు గరిష్ట చిల్లర ధర(ఎమ్మార్పీ) స్పష్టంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని తెలిపారు. సీల్ తెరిచిన సంచులను లేదా అనుమానాస్పద ప్యాకింగ్ ఉన్న ఎరువులను కొనుగోలు చేయొద్దని మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు విక్రయిస్తున్న ఎరువులను కొనుగోలు చేయకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గ్రామాల్లో తిరుగుతూ లేదా వాహనాల ద్వారా విక్రయించే గుర్తు తెలియని వ్యక్తుల వద్ద ఎరువులు కొనుగోలు చేయవద్దన్నారు.

బిల్లు లేకుండా కొనుగోలు చేసిన ఎరువులకు నాణ్యత సమస్యలు వచ్చినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవడం కష్టమవుతుందన్నారు. కొనుగోలు చేసిన ఎరువుల బిల్లు, సంచి లేబుల్ ఇతర వివరాలను పంట పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచాలని గుర్తుచేశారు. రైతులు కూడా అనుమానాస్పద విక్రయాలపై వెంటనే వ్యవసాయ అధికారులకు సమాచారం అందించి సహకరించాలని ఆయన కోరారు. రైతుల అప్రమత్తతే నకిలీ ఎరువుల నివారణకు ఉత్తమ ఆయుధమని ఆయన అన్నారు.

Next Story