RBI నుంచి 1.28 లక్షల కోట్ల బంగారం మిస్!.. అసలేం జరిగిందంటే?

by Muthe.Rajitha |

కేంద్ర ఖజానా నుంచి 1.28 లక్షల కోట్ల బంగారం మిస్ అయిందని వస్తున్న వార్తలు అబద్దం అంటూ కొట్టిపడేసింది ఆర్బీఐ.

RBI నుంచి 1.28 లక్షల కోట్ల బంగారం మిస్!.. అసలేం జరిగిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : "RBI ఖజానా నుంచి రూ. 1.28 లక్షల కోట్ల విలువైన బంగారం మిస్ అయింది" అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ వార్తపై స్పందించిన PIB Fact Check, RBI ఇదొక ఫేక్ న్యూస్ అంటూ ఖండించాయి. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. RBI విడుదల చేసిన ఫిబ్రవరి 6, 2026 వరకు ఉన్న వారపు గణాంకాల ప్రకారం.. భారత విదేశీ మారక నిల్వలు (Forex Reserves) $6.711 బిలియన్లు తగ్గి $717.064 బిలియన్లకు తగ్గాయి. గత వారం అనగా జనవరి 30 వరకు ఇవి $723.774 బిలియన్లకు చేరి ఆల్ టైమ్ హై రికార్డ్ సాధించాయి. ఈ మొత్తం నిల్వల్లో గోల్డ్ రిజర్వ్స్ విలువ కూడా $14.208 బిలియన్లు తగ్గి $137.68 బిలియన్ల నుంచి $123.476 బిలియన్లకు చేరింది.

ఈ తగ్గుదల కారణంగా సుమారు రూ. 1.28 లక్షల కోట్ల విలువ తగ్గినట్టు కనిపిస్తోంది. అయితే ఇది కేవలం బంగారం అంతర్జాతీయ ధరలు కొంచెం తగ్గడం వలన వచ్చిన విలువ మార్పు మాత్రమే. RBI వద్ద ఉన్న బంగారం టన్నుల పరంగా ఏమాత్రం తగ్గలేదు. అమ్మలేదు. మిస్ కూడా కాలేదు. గత కొన్ని వారాల్లో బంగారం ధరలు భారీగా పెరగడంతో రిజర్వ్స్ విలువ పెరిగింది. ఇప్పుడు ధరలు తగ్గడంతో విలువ కూడా తగ్గింది. ఇది పూర్తిగా మార్కెట్ ఫ్లక్చుయేషన్ మాత్రమే.

ఈ వార్తను PIB Fact Check, RBI ఖండించాయి. "బంగారం మిస్ అయింది" అనే వార్త పూర్తిగా అబద్దం అని చెప్పారు. కాగా సోషల్ మీడియాలో మాత్రం.. " RBI నుంచి బంగారం మిస్ అయింది" అంటూ తప్పుదారి పట్టించే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇలాంటి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా "35 టన్నుల బంగారం అమ్మేశారు", "200 టన్నుల గోల్డ్ ట్రాన్స్‌ఫర్ చేశారు" వంటి వార్తలు వచ్చాయి. అవన్నీ కూడా తప్పుడు ప్రచారాలేనని RBI స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని, ఏవైనా అనుమానాలు ఉంటే RBI అధికారిక వెబ్‌సైట్‌లో 'Weekly Statistical Supplement' మ్యాగజైన్ లేదా PIB Fact Check వంటి అధికారికవెబ్సైట్లు చూసి మాత్రమే నమ్మాలని అధికారులు కోరారు.

Next Story