పరీక్షలంటే భయం కాదు.. పండుగ: మంత్రి హరీశ్ రావు

by Disha Web Desk 12 |
పరీక్షలంటే భయం కాదు.. పండుగ: మంత్రి హరీశ్ రావు
X

దిశ, సిద్దిపేట : వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఒత్తిడిని జయించి.. పరీక్షలంటే పండుగల భావించి మెరుగైన ఫలితాలు సాధించాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు హితవుపలికారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని న్యూ హైస్కూల్ ఆవరణలో డాక్టర్ రాగి గంగారాం సహకారంతో రూ.25 లక్షలతో నిర్మించిన భోజనశాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిచేలా విద్యాశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు.

పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులు స్ఫూర్తిని పొందేలా త్వరలో ఉత్తరాలు రానున్నట్లు మంత్రి వెల్లడించారు. విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలను మరిచిపోవద్దనే పదానికి గంగారాం సార్థకత చేకూర్చారని కొనియాడారు. ప్రైవేట్, ఇంగ్లీష్ మీడియం మోజులో పడి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.7300 కోట్లతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు డ్యూయల్ మోడల్ లో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పుస్తకాల ముద్రణ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు సైతం త్వరలోనే శిక్షణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 7 నుంచి 12వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు వంద కోట్ల వ్యయంతో హెల్త్ అండ్ హైజినిక్ కిట్లు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందించనున్నట్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాత సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించేందుకు విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని సూచించారు.

విద్యార్థినికి మంత్రి భరోసా..

న్యూ హై స్కూల్ లో చదువుకుంటున్న విద్యార్థిని భార్గవికి మంత్రి హరీశ్ రావు బాసటగా నిలిచారు. విద్యార్థిని భార్గవికి బైక్ మోటార్, ఉన్నత విద్య కోసం మిట్టపల్లి గురుకుల పాఠశాలలో సీటు ఇప్పిస్తానని మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజులా రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, విద్యాశాఖ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed