ప్రభుత్వ ప్రకటనలను ఆ శాఖ ద్వారానే జారీ చేయాలి: కలెక్టర్

by Dishafeatures2 |
ప్రభుత్వ ప్రకటనలను ఆ శాఖ ద్వారానే జారీ చేయాలి: కలెక్టర్
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని అన్ని శాఖల అధికారులు వారి వారి కార్యాలయాల నుంచి ఇచ్చే ఆర్థికపరమైన ప్రకటనలు, నోటిఫికేషన్లు, టెండర్‌ నోటీసులు, భూసేకరణ ప్రకటనలన్నింటినీ తప్పనిసరిగా కమిషనర్‌, సమాచార పౌరసంబంధాలశాఖ, హైదరాబాద్‌ వారి ద్వారా మాత్రమే జారీ చేయాలని సిద్దిపేట కలెక్టర్‌ హనుమంత రావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఏ ప్రభుత్వ శాఖ నుంచి అయినా జారీ చేసే ప్రకటనలు తప్పనిసరిగా సమాచార శాఖ ద్వారా మాత్రమే పత్రికలకు ఇవ్వాలని నిర్ధిష్టమైన ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 52లో ఉందన్నారు. అయితే కొన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిద్దిపేట జిల్లా అధికారులు, జిల్లా పరిధిలోని రాష్ట్ర కార్పొరేషన్లు, లోకల్‌ బాడీలు, రిజిస్ట్రార్స్‌ ఆఫ్‌ యూనివర్సిటీల అధికారులు నేరుగా పత్రికలకు ప్రకటనలు జారీ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ఇక నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు, జిల్లా పరిధిలోని రాష్ట్ర కార్పొరేషన్లు, లోకల్‌ బాడీలు, రిజిస్ట్రార్స్‌ ఆఫ్‌ యునివర్సిటీల అధికారులు తప్పని సరిగా కమిషనర్‌, సమాచార పౌర సంబంధాల శాఖ, సమాచార భవన్‌, ఏ.సి.గార్డ్స్‌, మాసబ్‌ట్యాంక్‌, హైదరాబాద్‌ కార్యాలయం ద్వారా మాత్రమే జారీ చేయాలన్నారు. ప్రకటనలకు సంబంధించిన సందేహాలు ఏమైనా ఉంటే వాటి నివృత్తికి, అలాగే ప్రకటనల జారీకి సమాచార శాఖ సంయుక్త సంచాలకులు డి.శ్రీనివాస్‌‌ను మొబైల్‌ నంబర్‌కు 9949351678 ద్వారా సంప్రదించాలని సూచించారు. ఎవరైనా అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనలు, ఆర్థికశాఖ ఆదేశాలకు విరుద్ధంగా ప్రకటనలు జారీ చేస్తే వారిపై తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ యం హనుమంత రావు స్పష్టం చేశారు.


Next Story

Most Viewed