Pharma: జనరిక్ మెడిసిన్స్‌పై రెండేళ్లపాటు జీరో టారిఫ్‌లు

by S Gopi |

అమెరికాలోనే జెనరిక్ ఔషధాల తయారీని ప్రోత్సహించడం, విదేశీ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ట్రంప్ తెలిపారు.

Pharma: జనరిక్ మెడిసిన్స్‌పై రెండేళ్లపాటు జీరో టారిఫ్‌లు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెనరిక్ మందుల దిగుమతులపై కొత్త టారిఫ్ విధానాన్ని ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే జెనరిక్ మందులపై తొలి రెండేళ్ల పాటు ఎలాంటి సుంకం ఉండదని స్పష్టం చేశారు. అయితే ఆ గడువు ముగిసిన తర్వాత మూడో సంవత్సరంలో 100 శాతం, ఆపై 200 శాతం వరకు టారిఫ్ విధించనున్నారు. అమెరికాలోనే జెనరిక్ ఔషధాల తయారీని ప్రోత్సహించడం, విదేశీ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ట్రంప్ తెలిపారు. నిర్ణయించిన గడువులోగా అమెరికాలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయని కంపెనీలపై జరిమానాలు కూడా విధిస్తామని ఆయన హెచ్చరించారు. అయితే పేటెంట్, బ్రాండెడ్ ఔషధాలపై ప్రస్తుతం అమలులో ఉన్న విధానంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.

ఈ నిర్ణయం భారత ఫార్మా రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ప్రపంచానికి జెనరిక్ మందుల ప్రధాన సరఫరాదారుగా ఉన్న భారత్‌ను 'ప్రపంచ ఫార్మసీ'గా పిలుస్తారు. అమెరికాలో వినియోగించే జెనరిక్ మందుల్లో పరిమాణం పరంగా దాదాపు 40 శాతం భారత్ నుంచే వెళ్తాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత్ అమెరికాకు 9.7 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేయగా, అది దేశ మొత్తం ఫార్మా ఎగుమతుల్లో 38 శాతం వాటాను కలిగి ఉంది. అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, డిప్రెషన్, అంటువ్యాధులు వంటి అనేక చికిత్సల్లో భారత జెనరిక్ మందులు అమెరికాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా గర్భనిరోధక మాత్రల విభాగంలో 2024లో అమెరికాలో సూచించిన మాత్రల్లో దాదాపు 65 శాతం భారత కంపెనీలైన గ్లెన్‌మార్క్, లూపిన్ తయారు చేసినవే. అయితే భారత్–అమెరికా మధ్య ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందం కారణంగా జెనరిక్ మందులు, వాటి ముడి పదార్థాలపై కొన్ని మినహాయింపులు లేదా సడలింపులు లభించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నప్పటికీ, ట్రంప్ తాజా ప్రకటన భారత ఫార్మా ఎగుమతిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.

Next Story