- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్యూమరేషన్ ఫారాలను త్వరితగతిన బీఎల్ఓలకు అందించాలి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారంలను తగిన వివరాలతో పూరించి త్వరితగతిన బీ.ఎల్.ఓలకు అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఓటర్లకు సూచించారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారంలను తగిన వివరాలతో పూరించి త్వరితగతిన బీ.ఎల్.ఓలకు అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఓటర్లకు సూచించారు. వివరాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉన్నందున, నిర్ణీత గడువు వరకు వేచి చూడకుండా వెంటదివెంట ఫారాలను నింపి బీ.ఎల్.ఓలకు సమర్పించాలని ఓటర్లను కోరారు. శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటి కమిషనర్ పవన్ కుమార్ శర్మ న్యూడిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణలోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డితో పాటు అన్ని జిల్లా కలెక్టర్లతో ఎస్.ఐ.ఆర్ అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల వారీగా ఎస్.ఐ.ఆర్ అమలులో ఇప్పటివరకు సాధించిన ప్రగతి గురించి అడిగి తెలుసుకుని, ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.
వీ.సీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ.ఆర్.ఓలు, ఏఈఆర్ఓలు, సూపర్ వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల నుండి ఎన్యూమరేషన్ ఫారంల స్వీకరణ, వాటి వివరాలను డిజిటలైజ్ చేయడంలో వెనుకంజలో ఉన్న సూపర్ వైజర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో పురోగతి చూపని నిజామాబాద్ అర్బన్ పరిధిలోని ముగ్గురు సూపర్ వైజర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్.ఐ.ఆర్ అమలు తీరును తేలికగా తీసుకోరాదని, నిర్ణీత గడువు లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయని వారిపై ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. గడువు సమీపించిన దృష్ట్యా శని, ఆదివారాలు సెలవు దినాలలో కూడా పని చేయాలని తేల్చి చెప్పారు.
వచ్చే సోమవారం నాటికి అర్బన్ లో 35 శాతం, రూరల్ నియోజకవర్గాల పరిధిలో 50 శాతం ప్రక్రియ పూర్తి కావాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ.ఆర్.ఓలు, ఏ.ఈ.ఆర్.ఓలు కూడా క్షేత్రస్థాయిలో ఉంటూ, ఎన్యూమరేషన్ ఫారంల సేకరణ, వాటి డిజిటలైజేషన్ ప్రక్రియలు వేగవంతం అయ్యేలా పర్యవేక్షణ జరపాలని, రోజువారీ ప్రగతిని తనకు నివేదించాలని ఆదేశించారు. బీ.ఎల్.ఓలకు సహకారం అందించేలా వీఓఏలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులతో కూడిన వారిని వాలంటీర్లుగా నియమించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరు ఓటర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఎన్యూమరేషన్ ఫారాలు సరైన విధంగా పూరించడంలో వారికి సహకరించాలని హితవు పలికారు. ప్రతి బీఎల్ఓ వద్ద ఫొటోలతో కూడిన ఓటరు జాబితా తప్పనిసరిగా ఉండాలన్నారు. వివరాల పరిశీలన సమయంలో అందుబాటులో లేని, చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్ళిన, రెండు చోట్ల ఓటు కలిగిన ఓటర్ల పేర్లను గుర్తిస్తూ పక్కాగా జాబితాను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ జాబితాపై రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని సూచించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బీఎల్ఏలు స్థానికంగా అందుబాటులో ఉంటూ, ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు బీ.ఎల్.ఓలకు తగిన సహకారం అందించాలని అన్నారు. ప్రతి రోజు ఓటర్ల నుండి 50 చొప్పున ఎన్యూమరేషన్ ఫారంలు సేకరిస్తూ బీఎల్ఓ లకు అందించాలని అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులు తగు చొరవ చూపాలని కలెక్టర్ కోరారు.
ఎన్యూమరేషన్ ఫారంలు అందించే విషయంలో ఓటర్లు తాత్సారం చేయకుండా, వెంటనే ఫారాలను వివరాలతో నింపి బీఎల్ఓలకు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, విజయలక్ష్మి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఏఈఆర్ఓలు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.






