భారత్ ఘోర ఓటమి.. సిరీస్ ఇంగ్లండ్‌ కైవసం

by Muthe.Rajitha |

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో టి20లోనూ భారత్ దారుణ పరాజయాన్ని చవిచూసింది.

భారత్ ఘోర ఓటమి.. సిరీస్ ఇంగ్లండ్‌ కైవసం
X

దిశ, వెబ్ డెస్క్ : భారత టి20 జట్టు వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో టి20లోనూ భారత్ దారుణ పరాజయాన్ని చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా చేతులెత్తేసిన భారత్‌పై ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో టీమిండియా సిరీస్‌లో హ్యాట్రిక్ పరాజయాన్ని నమోదు చేయడమే కాకుండా, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0 తేడాతో సిరీస్‌ను ఇంగ్లండ్‌కు సమర్పించుకుంది.

మళ్లీ నిరాశపరిచిన బ్యాటింగ్ లైనప్

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో భారత టాప్ ఆర్డర్ మరోసారి తడబడింది. ఏ ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో ఎక్కువసేపు నిలదొక్కుకుని భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోవడంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.

బ్రూక్, సాల్ట్ మెరుపు విధ్వంసం.. 13.5 ఓవర్లలోనే ఫినిష్!

159 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు భారత బౌలర్లు ఎలాంటి పోటీని ఇవ్వలేకపోయారు. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, హ్యారీ బ్రూక్ భారత బౌలింగ్‌ను చీల్చిచెండారు. ముఖ్యంగా బ్రూక్ (79 పరుగులు), సాల్ట్ (59 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌లతో స్టేడియం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించారు. దీనితో ఇంగ్లండ్ కేవలం 13.5 ఓవర్లలోనే కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అవలీలగా చేధించింది.

సిరీస్ కోల్పోయిన భారత్

మొదటి మ్యాచ్ ఫలితం తేలనప్పటికీ, ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ వరుసగా ఓడిపోవడంతో భారత్‌కు ఈ సిరీస్‌లో తీవ్ర నిరాశే ఎదురైంది. కనీసం చివరిదైన ఐదో టి20లోనైనా గెలిచి క్లీన్‌స్వీప్ అవ్వకుండా పరువు నిలుపుకోవాలని టీమిండియా భావిస్తోంది

Next Story