కరీంనగర్‌లో ఘోర ప్రమాదం.. డిపోలోనే తగలబడ్డ ఎలక్ట్రిక్ బస్సు

by Muthe.Rajitha |

కరీంనగర్ రెండో డిపోలో మంగళవారం అర్ధరాత్రి దాటాక భారీ ప్రమాదం చోటుచేసుకుంది.

కరీంనగర్‌లో ఘోర ప్రమాదం.. డిపోలోనే తగలబడ్డ ఎలక్ట్రిక్ బస్సు
X

దిశ, వెబ్ డెస్క్ : కరీంనగర్ రెండో డిపోలో మంగళవారం అర్ధరాత్రి దాటాక భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డిపో ఆవరణలో పార్కింగ్ చేసిన TGSRTC కి చెందిన ఎలక్ట్రికల్ ఎక్స్‌ప్రెస్‌ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించడంతో వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో ఒక పెద్ద ప్రాణనష్టం తప్పినప్పటికీ.. డిపో లోపలే ఈ తరహా ఘటన జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ బస్సులకు సంబంధించి ఈ తరహా అగ్నిప్రమాదం జరగడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. ఈ వరుస ఘటనలు ప్రయాణికులతో పాటు అటు ఆర్టీసీ అధికారుల్లోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటివల కొద్దిరోజుల క్రితమే తిమ్మాపూర్ సమీపంలో కూడా ఒక ఎలక్ట్రిక్‌ బస్సు రోడ్డుపై వెళ్తుండగా ఇలాగే అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఆ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన ప్రముఖ ఈవీ తయారీ సంస్థ 'జేబీఎం' (JBM) సాంకేతిక నిపుణుల బృందం.. అసలు మంటలు ఎందుకు చెలరేగాయనే కారణాలను ఇప్పటివరకు స్పష్టంగా తేల్చలేకపోయింది. ఒక ప్రమాదానికి గల కారణాలు తెలియకముందే, తాజాగా డిపోలోనే మరో ఎలక్ట్రిక్ బస్సు అగ్ని ప్రమాదానికి గురికావడం బ్యాటరీ భద్రత, సాంకేతిక లోపాలపై అనేక అనుమానాలకు తావిస్తోంది.

Next Story