కొండెక్కిన కోడిగుడ్డు ధర

by Ratna Kumari |

కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.

కొండెక్కిన కోడిగుడ్డు ధర
X

దిశ, ఆమనగల్లు : కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. వారం రోజుల క్రితం రూ.6.50కు విక్రయించిన ఒక్కో గుడ్డు ప్రస్తుతం మార్కెట్‌లో రూ.7.50 నుంచి రూ.9 వరకు అమ్ముతున్నారు. ప్రస్తుతం పౌల్ట్రీ ఫారాల నుంచి రిటైల్ వ్యాపారులకు హోల్‌సేల్ ధరగా ఒక్కో గుడ్డును రూ.6.05కు సరఫరా చేస్తున్నారు. అయితే రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డుపై రూ.1.45 వరకు అదనంగా వసూలు చేస్తూ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎండల తీవ్రత కారణంగా గుడ్ల ఉత్పత్తి తగ్గడంతో సరఫరా తగ్గిందని పౌల్ట్రీ రంగానికి చెందిన వారు చెబుతున్నారు. దీంతో డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేక ధరలు పెరిగినట్లు పేర్కొంటున్నారు. ధరల పెరుగుదల ప్రభావం మధ్యాహ్న భోజన పథకంపై కూడా పడుతోంది. పాఠశాలల్లో విద్యార్థులకు గుడ్లు సరఫరా చేసే ఏజెన్సీలు పెరిగిన ధరలు, బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. దీంతో గుడ్ల సరఫరాపై అనిశ్చితి నెలకొంది. వర్షాలు కురిసి వాతావరణం అనుకూలిస్తేనే గుడ్ల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలను ఎదుర్కొంటోందని, ప్రస్తుత పరిస్థితుల్లో గిట్టుబాటు కావడం లేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

Next Story