ముడి పామాయిల్ ధరలపై దిగుమతి సుంకం తగ్గించిన కేంద్రం!

by Web Desk |
ముడి పామాయిల్ ధరలపై దిగుమతి సుంకం తగ్గించిన కేంద్రం!
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొంతకాలంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితుల నేపథ్యంలో ముడి పామాయిల్ ధరలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో దేశంలో వంట నూనెల ధరలు కట్టడి చేయడమే కాకుండా దేశీయంగా ప్రాసెస్ చేసే కంపెనీలకు మద్దతు లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో తాజా నిర్ణయం ప్రకారం ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 8.25 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించారు. ఇక, ఇప్పటికే ముడి పామాయిల్‌పై బేసిక్ కస్టమ్స్ తొలగించగా, తాజాగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, కస్టమ్స్‌ (సీబీఐసీ) ద్వారా అగ్రి ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ సెస్‌ను 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఇది ఆదివారం నుంచి అమలవుతుందని సీబీఐసీ పేర్కొంది. అగ్రి డెవలప్‌మెంట్ సెస్, సాంఘిక సంక్షేమ సెస్‌లను పరిగణలోకి తీసుకున్న అనంతరం ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకం 8.25 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గుతుంది. సీబీఐసీ నోటిఫికేషన్‌లో ముడి పామాయిల్, ఇతర ముడి వంటనూనెలపై తగ్గించిన దిగుమతి సుంకాన్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. అలాగే, పరిశ్రమల సంస్థ సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్(ఎస్ఈఏ) ముడి పామాయిల్, శుద్ధి చేసిన పామాయిల్ మధ్య సుంకం వ్యత్యాసం ఇప్పుడున్న 13.75 శాతం నుంచి 11 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేస్తోంది.

Next Story

Most Viewed