అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

by Malleboina Mahesh |

అమెరికా-ఇరాన్ యుద్ధం ముగియడంతో మార్కెట్లలో జోష్. సెన్సెక్స్ 1112 పాయింట్లు, నిఫ్టీ 335 పాయింట్లు జంప్.. ఇన్వెస్టర్ల లాభాల పంట!

అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ముగిసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు నెలకొని.. భారత స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు రాకెట్‌లా దూసుకెళ్లాయి. గత 107 రోజులుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇరుదేశాలు శాంతి ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడం, ప్రపంచ మార్కెట్లలో క్రూడాయిల్ (కారణంగా చమురు) ధరలు భారీగా తగ్గడం స్టాక్ మార్కెట్లలో సరికొత్త జోష్ నింపింది. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు వాటా కలిగిన అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ జలమార్గాన్ని తిరిగి తెరిచేందుకు అమెరికా, ఇరాన్ అంగీకరించడంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ఒత్తిడి ఒక్కసారిగా తగ్గిపోయింది.

స్విట్జర్లాండ్‌లో జరిగిన ముఖాముఖి చర్చల అనంతరం కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత రాత్రి అధికారికంగా ప్రకటించారు. జూన్ 19న స్విట్జర్లాండ్‌లోనే ఈ శాంతి ఒప్పందంపై అధికారికంగా సంతకాలు జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరిణామాలతో సోమవారం నాటి ముందస్తు ట్రేడింగ్‌లో 30 షేర్ల బీఎస్‌ఈ (BSE) సెన్సెక్స్ ఏకంగా 1,112.70 పాయింట్లు లాభపడి 76,648.74 వద్దకు దూసుకెళ్లింది. అలాగే 50 షేర్ల ఎన్‌ఎస్‌ఈ (NSE) నిఫ్టీ కూడా 335.55 పాయింట్ల భారీ లాభాన్ని అందుకొని 23,956.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. యుద్ధం ముగియడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మున్ముందు మరిన్ని మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.

Next Story