శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. అర్థరాత్రి భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు

by Malleboina Mahesh |   (  Updated:2026-03-10 04:42:56  IST  )

పొరుగు దేశాల్లో ఇంధన మంట! శ్రీలంకలో లీటర్ పెట్రోల్‌పై రూ. 25 వరకు పెంపు. పాకిస్థాన్‌లో ఏకంగా రూ. 55 పెంచిన ప్రభుత్వం. సామాన్యులపై భారంతో పెరగనున్న నిత్యావసర ధరలు.

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. అర్థరాత్రి భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక (Sri Lanka)పై పశ్చిమ ఆసియా దేశాల యుద్ధం తీవ్ర ప్రభావం పడింది. దీంతో దేశంలో ఇంధన ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఆర్థిక సంక్షోభం (Financial crisis) నుంచి కోలుకునేందుకు శ్రీలంక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం నిన్న అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చింది. తాజా సవరణ ప్రకారం.. ఆక్టేన్ 92 పెట్రోల్ ధర లీటరుకు రూ. 24 పెరగడంతో ప్రస్తుతం అది రూ. 317కు చేరుకుంది. అలాగే, ఆక్టేన్ 95 పెట్రోల్ లీటరుకు రూ. 25 పెరిగి రూ. 365కు చేరగా, ఆటో డీజిల్ రూ. 22 పెరిగి రూ. 303కు, సూపర్ డీజిల్ రూ. 24 పెరిగి రూ. 353 వద్ద విక్రయించబడుతోంది. నిత్యావసరమైన కిరోసిన్ ధర కూడా లీటరుకు రూ. 13 పెరిగి రూ. 195కు చేరడంతో సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడనుంది.

శ్రీలంక కంటే ముందే మరో పొరుగు దేశం పాకిస్థాన్ కూడా ఇంధన ధరలను భారీగా పెంచి ప్రజలకు షాక్ ఇచ్చింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు ఏకంగా రూ. 55 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల అస్థిరత, దేశీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండు దేశాలు తీసుకున్న నిర్ణయాలు అక్కడ ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచేలా ఉన్నాయి. వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండటంతో రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయని ఆయా దేశాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story