ఊపిరితిత్తుల వైఫల్యానికి చెక్.. ప్రాణాలు నిలిపే 'ఎక్మో' చికిత్స అందుబాటులోకి!

by Jakkula.Mamatha |

తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకునే రోగులను కాపాడటంలో ‘ఎక్మో’ (ఎక్మో) సాంకేతిక విధానం కీలక పాత్ర పోషిస్తోందని యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ కన్సల్టెంట్ ట్రాన్స్‌ప్లాంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ కాత్రగడ్డ తెలిపారు.

ఊపిరితిత్తుల వైఫల్యానికి చెక్.. ప్రాణాలు నిలిపే ఎక్మో చికిత్స అందుబాటులోకి!
X

దిశ, మిర్యాలగూడ రూరల్: తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకునే రోగులను కాపాడటంలో ‘ఎక్మో’ (ఎక్మో) సాంకేతిక విధానం కీలక పాత్ర పోషిస్తోందని యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ కన్సల్టెంట్ ట్రాన్స్‌ప్లాంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ కాత్రగడ్డ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె ‘ఎక్మో సపోర్ట్ విత్ లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ విధానం విశిష్టతను వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రోగులకు అంతర్జాతీయ స్థాయి క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులో ఉన్నాయని, ముఖ్యంగా చివరిదశ ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్ (ఐఎల్‌డీ), తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యంతో బాధపడుతున్న వారికి ఈ విధానం ప్రాణరక్షణగా నిలుస్తుందని తెలిపారు.

ఊపిరితిత్తులు రక్తానికి అవసరమైన ఆక్సిజన్‌ను అందించలేని పరిస్థితుల్లో ‘వెనో-వీనస్ ఎక్మో’ యంత్రం కృత్రిమ ఊపిరితిత్తుల్లా పని చేస్తుందని వివరించారు. శరీరం నుంచి ఆక్సిజన్ లేని రక్తాన్ని తీసుకుని, దానికి ఆక్సిజన్ అందించి కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించి తిరిగి శరీరంలోకి పంపుతుందని చెప్పారు. ఊపిరితిత్తుల మార్పిడి అవసరమైన రోగులకు దాత లభించే వరకు ప్రాణాలను నిలబెట్టేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు. ఎక్మో సపోర్ట్‌పై ఉన్న రోగులకు డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిర్వహించడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అని, గుండె-ఊపిరితిత్తుల నిపుణులు, అనస్థీషియా వైద్యులు, ఐసీయూ బృందం సమన్వయంతో శస్త్రచికిత్స విజయవంతం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం వంటి సవాళ్లను అధిగమిస్తూ ఈ చికిత్స నిర్వహిస్తామని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం ప్రత్యేక క్రిటికల్ కేర్ ప్రోటోకాల్స్, రిహాబిలిటేషన్ ద్వారా రోగులను ఎక్మో, వెంటిలేటర్ సపోర్ట్ నుంచి తొలగించి కొత్త ఊపిరితిత్తులతో స్వయంగా శ్వాస తీసుకునే స్థితికి తీసుకువస్తామని డాక్టర్ తపస్వి వివరించారు. ఊపిరితిత్తుల వ్యాధి చివరి దశకు చేరిన ఆశలు వదులుకోవలసిన అవసరం లేదని, అధునాతన వైద్య సదుపాయాలతో ప్రాణాలను కాపాడటం సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో యశోద హాస్పిటల్స్ మార్కెటింగ్ మేనేజర్ ఉమేష్, అసిస్టెంట్ మేనేజర్ రాంప్రకాష్‌తో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story