TG : ఎబోలా అనుమానితులు డిశ్చార్జ్

by Muthe.Rajitha |

తెలంగాణలో ఎబోలా అనుమానిత కేసులుగా నమోదైన ఇద్దరిని నేడు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసారు.

TG : ఎబోలా అనుమానితులు డిశ్చార్జ్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర ఆందోళన రేకెత్తించిన ఎబోలా (Ebola) అనుమానిత కేసుల ఉదంతం సుఖాంతమైంది. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఎబోలా లక్షణాలతో ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం వైద్యులు డిశ్చార్జ్ చేశారు. సుడాన్ దేశం నుంచి నగరానికి వచ్చిన వీరిద్దరిలో ఎబోలా వైరస్ ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ హుటాహుటిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించిన సంగతి తెలిసిందే.

రెండుసార్లు పరీక్షలు.. నెగెటివ్

బాధితుల నుంచి వైద్యులు రెండు విడతలుగా రక్త నమూనాలను సేకరించి, పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ల్యాబ్‌కు పంపించారు. ఈ రెండు పరీక్షల్లోనూ వారికి ఎబోలా లేదని 'నెగెటివ్' అని నివేదికలు రావడంతో వైద్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వారు పూర్తిగా కోలుకోవడంతో నేడు డిశ్చార్జ్ చేసినట్లు గాంధీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే, ఆసుపత్రి నుంచి వెళ్లినప్పటికీ మరికొద్ది రోజుల పాటు వారి ఆరోగ్య పరిస్థితిని ఫోన్ ద్వారా నిరంతరం మానిటర్ చేస్తామని, వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ కొన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వారికి సూచించినట్లు పేర్కొన్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్

ఈ కేసుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) వచ్చే ఆఫ్రికా దేశాల ప్రయాణికులపై ఆరోగ్య శాఖ, విమానాశ్రయ అధికారులు మరింత ప్రత్యేక దృష్టి సారించారు. ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రయాణికులకు పూర్తి స్థాయి థర్మల్ స్క్రీనింగ్, వైద్య తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని నిర్ధారణ అయిన తర్వాతే నగరంలోకి అనుమతిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Next Story