ముందస్తుకు టీఆర్ఎస్ రెడీ.. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా వ్యూహం

by Disha Web Desk 2 |
ముందస్తుకు టీఆర్ఎస్ రెడీ.. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా వ్యూహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని సెక్షన్ల వారికి వరాలు ప్రకటించారు. గతంలో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికీ హామీ ఇచ్చారు. తొలగించిన ఫీల్డు అసిస్టెంట్లనూ తీసుకుంటామని, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలు సైతం పరిష్కరిస్తామని సీఎం ప్రకటన చేయడంతో ఇది ముందస్తు ఎన్నికలకు సూచన అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గుసగుసలాడుతున్నారు. ఎన్నికల కోసమే వరాలని టీఆర్ఎస్ శ్రేణులు సైతం అభిప్రాయ పడుతున్నాయి.

టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవి కొన్ని పరిష్కారం కాగా, కొన్ని నిధులు లేక నిలిచిపోయాయి. మరికొన్ని అసలే ప్రారంభం కాలేదు. అయితే, అసెంబ్లీ చివరి రోజున పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అందరికీ వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మెప్మా, సెర్ప్ ఉద్యోగులకు వేతనాలు ఇస్తామని ప్రకటన చేశారు. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ తీసుకోవడం, మధ్యాహ్న భోజన కార్మికులకు వెయ్యి నుంచి 3 వేల వేతనం పెంపు, పీఆర్ఏలను ఇరిగేషన్‌లో లష్కర్‌లుగా ప్రమోషన్స్, 111జీవో రద్దు, దేవాలయ భూముల అన్యాక్రాంతం కాకుండా చర్యలు, సాదాబైనామాలు, నోటరైజ్డ్ డాక్యమెంట్ల క్రమబద్దీకరణ, కళాశాలు, డిగ్రీ కళాశాలల నిర్మాణం, ధరణి సమస్యల పరిష్కారం, 700లకు పైగా ఉక్రెయిన్ విద్యార్థులకు మెడికల్ విద్య, ఉస్మానియా ఆసుపత్రి పునర్ నిర్మాణం, అకాల వర్షాలకు పంటనష్టపోయిన పత్తి, రైతులకు పరిహారం, ఈ మార్చి 31 వరకు 40వేల కుటుంబాలకు దళిత బంధు, పోడు భూముల సమస్యకు పరిష్కారం, మెడికల్ కళాశాలల్లో నర్సింగ్ కళాశాలలకు అనుమతి, హెల్త్ యూనివర్సిటీల్లో పారామెడికల్ కోర్సులు, మైనార్టీ విద్యార్థులకు పెండింగ్ రీయింబర్స్ మెంట్ విడుదల తదితర హామీలను ఇచ్చారు. బడ్జెట్‌లో సైతం డబుల్ బెడ్రులతో పాటు ఇళ్ల స్థలాలు ఉన్నవారికి 3లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. ఒక్కసారిగా అన్ని వర్గాలను ఆకట్టుకునే వ్యూహంను అసెంబ్లీలో కేసీఆర్ అమలు చేశారు.

సీఎం కేసీఆర్ హామీలు, వరాలు ప్రకటించడంతో ముందస్తున్న ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాలకు వెళ్లారు. ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన హామీలు, చేసిన ప్రకటన, విధుల విడుదల, చేసిన అభివృద్ధిని వివరించే పనిలో పడ్డారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక తెప్పించుకున్న కేసీఆర్.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు వారిపై నిఘా పెట్టనున్నట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యేలు నియోజకవర్గమంతా కలియతిరగాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. గతంలో జరిగిన అభివృద్ధి, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని వివరించే పనిలో నిమగ్నమయ్యారు. కేసీఆర్ అసెంబ్లీలో మెప్మా, సెర్ప్, ఫీల్డు అసిస్టెంట్లతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంపు సైతం తమకు కలిసి వచ్చే అవకాశం అని, వీటిని మరింత ప్రచారం చేసి మరోసారి విజయం సాధించాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ముందస్తు రావొచ్చనే అభిప్రాయంతో సన్నద్ధమవుతున్నారు.



Next Story