అర్హులైన లబ్ధిదారులకే డబుల్ బెడ్రూం ఇళ్లు

by Batti.Sumithra |

డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని మండల తహసీల్దార్ పనకంటి సతీష్ కుమార్ శర్మ తెలిపారు.

అర్హులైన లబ్ధిదారులకే డబుల్ బెడ్రూం ఇళ్లు
X

దిశ, మందమర్రి : డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని మండల తహసీల్దార్ పనకంటి సతీష్ కుమార్ శర్మ తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను ప్రభుత్వ నిబంధనల మేరకు ఎంపిక చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం గృహ పథకంలో సొంత ఇల్లు లేని అర్హులకే ఇళ్లను కేటాయించామని పేర్కొన్నారు. కేటాయింపుల్లో ఎవరైనా అనర్హులు ఉన్నట్లు ఎవరికైనా సమాచారం ఉంటే, సంబంధిత ఆధారాలతో మండల తహసీల్దార్ కార్యాలయంలో గానీ, మున్సిపల్ కార్యాలయంలో గానీ ఫిర్యాదు లేదా దరఖాస్తు సమర్పించాలని సూచించారు. అలాంటి ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టి, అనర్హులుగా తేలితే వారి పేర్లను జాబితా నుంచి తొలగించే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తామని చెప్పి కొందరు ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని హెచ్చరించిన తహసీల్దార్, అలాంటి వ్యక్తుల మాటలను నమ్మి ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇళ్ల కేటాయింపుకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉంటే నేరుగా తహసీల్దార్ కార్యాలయాన్ని గానీ, మున్సిపల్ కార్యాలయాన్ని గానీ సంప్రదించాలని సూచించారు.

Next Story