కాంగ్రెస్ సహకరిస్తేనే చర్చకు అవకాశం: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

by Malleboina Mahesh |

పార్లమెంటులో.. లోక్ సభ సజావుగా సాగేందుకు సహకరిస్తే, సభను ఎలా నడపాలనే అంశంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ సహకరిస్తేనే చర్చకు అవకాశం: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంటులో.. లోక్ సభ సజావుగా సాగేందుకు సహకరిస్తే, సభను ఎలా నడపాలనే అంశంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Union Minister Kiren Rijiju) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల అభిప్రాయాలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, స్పీకర్ సమక్షంలో తాము హామీ ఇచ్చామని కిరణ్ రిజిజు ఈ రోజు సాయంత్రం మీడియాకు తెలిపారు. అయితే రాహుల్ గాంధీ సభలో ఆరోపణలు చేస్తూ, గందరగోళం సృష్టిస్తూ, ఇతర సభ్యులను మాట్లాడనీయకుండా అడ్డుకోవడం సరికాదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ సభ్యులు మాట్లాడినప్పుడు, ఇతర పక్షాల సభ్యులకు కూడా మాట్లాడే అవకాశం కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి స్పష్టం చేశారు.

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్న విపక్షాల ఆలోచనపై కిరణ్ రిజిజు స్పందిస్తూ, వారికి తగినంత సంఖ్యాబలం లేదని కిరణ్ రిజిజు ఎద్దేవా చేశారు. విపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని, వారికి సంఖ్యా బలం లేకపోయినా అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. సభలో స్పీకర్ వ్యవస్థను విపక్షాలు అవమానించాయని, అధికారుల టేబుళ్లపైకి ఎక్కడం వంటి చర్యలు అత్యంత దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విపక్ష సభ్యుల ప్రవర్తన పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరవచ్చని, కానీ తాము ఆ దిశగా స్పీకర్‌పై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని మంత్రి వివరించారు. సభా మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపై ఉందని, స్పీకర్ తన విచక్షణ అధికారం మేరకు నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ చర్చకు సిద్ధంగానే ఉంటుందని, కానీ విపక్షాలే సభను అడ్డుకుంటూ ప్రజా సమస్యలను పక్కన పెడుతున్నాయని కిరణ్ రిజిజు ఆరోపించారు.

Next Story