డిజిటల్ రుణ సంస్థలు తప్పనిసరిగా ఆర్‌బీఐ నుంచి లైసెన్స్ తీసుకోవాలి: గవర్నర్ శక్తికాంత దాస్!

by Disha Web Desk 19 |
డిజిటల్ రుణ సంస్థలు తప్పనిసరిగా ఆర్‌బీఐ నుంచి లైసెన్స్ తీసుకోవాలి: గవర్నర్ శక్తికాంత దాస్!
X

ముంబై: ఫిన్‌టెక్ రంగంలో డిజిటల్ రుణాలందించే సంస్థలు తమ వ్యాపారాలను ప్రారంభించడానికి ముందు తప్పనిసరిగా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నుంచి అనుమతి పొందాని గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఫిన్‌టెక్ పరిశ్రమలో సంస్థలు వారికి మంజూరు చేసిన లైసెన్స్ కింద పని చేయాల్సి ఉంటుంది. దానికి మించి ఏదైనా కార్యకాలాపాలను నిర్వహిస్తుంటే తమ నుంచి అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా, లైసెన్స్ లేని కార్యకలాపాలు చేపడితే అవి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. దానివల్ల అనేక ఇబ్బందులు తలెత్తవచ్చు. అలాంటి చర్యలను తాము అనుమతించలేమని శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో దాస్ వెల్లడించారు. దేశీయంగా అందుబాటులోకి వస్తున్న ఇన్నోవేషన్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇదే సమయంలో ఆర్థిక రంగంలో క్రమబద్దత, నియంత్రణ విధానం పెరగాలని భావిస్తున్నాం. దీనివల్ల ఆర్థిక స్థిరత్వం బలంగా ఉంటుందని, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ లెండింగ్ నిబంధనలు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. కాగా, కొన్ని కొత్త జనరేషన్ డిజిటల్ రుణ సంస్థలు వినియోగదారుల నుంచి అధిక వడ్డీని వసూలు చేయడం, వారిని వేధించడం చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. కరోనా సమయంలో ఆర్థిక సంక్షోభం వల్ల తక్షణ రుణాలందించే ఇలాంటి సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే ఆర్‌బీఐ ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, సంస్థలకు అనేక సిఫార్సులు చేసింది.


Next Story