- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగాల్లో దీదీ vs మోదీ.. ఎవరికి దక్కేనో పీఠం!
బెంగాల్ పీఠం ఎవరిది? మమతా హ్యాట్రిక్ వర్సెస్ బీజేపీ వ్యూహాలు

దిశ, వెబ్ డెస్క్ : ఈ ఏడాదిలో వేసవి హీట్ మాత్రమే కాకుండా రాజకీయ వేడి కూడా పీక్ స్టేజికి చేరనుంది. మినీ సార్వత్రిక ఎన్నికలుగా పరిగణించబడుతున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో దేశవ్యాప్తంగా రాజకీయ కోలాహలం మొదలైంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో దేశం దృష్టి వెస్ట్ బెంగాల్ ఎన్నకలపైనే ఉందనడంలో అతియోశక్తి లేదు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు అనగానే దేశమంతా ఆసక్తిగా గమనించేది సీఎం మమతా బెనర్జీ, పీఎం నరేంద్ర మోడీల మధ్య జరిగే వ్యూహాత్మక యుద్ధాన్నే. 2011లో కమ్యూనిస్టుల సుదీర్ఘ పాలనకు చరమగీతం పాడి అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ, గత 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, ఈసారి ఆమెకు గట్టి సవాలు ఎదురవుతోంది. 2021 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన బీజేపీ, ఈసారి ఎలాగైనా బెంగాల్ పీఠాన్ని దక్కించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. 2026 ఏప్రిల్లో రెండు విడతలుగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నాలుగోసారి అధికారాన్ని దక్కించుకుని తన రికార్డును పదిలం చేసుకోవాలని చూస్తుంటే, బీజేపీ మాత్రం ఎలాగైనా బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని పట్టుదలతో ఉంది.
మమత బెంగాలీ సెంటిమెంటు మంత్రం
మమతా బెనర్జీ తన ప్రచారంలో ప్రధానంగా 'బెంగాలీ అస్మిత' అనగా బెంగాలీ ఆత్మగౌరవం సెంటిమెంటును వాడుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ నాయకత్వాన్ని 'బహిరాగతో' అంటే బయటి వ్యక్తులుగా అభివర్ణిస్తూ, బెంగాల్ సంస్కృతిని కాపాడే ఏకైక శక్తి తృణమూల్ కాంగ్రెస్ మాత్రమేనని దీదీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. 'లక్ష్మీర్ భండార్' వంటి సంక్షేమ పథకాలు ఆమెకు మహిళా ఓటర్లలో తిరుగులేని ఆదరణను కల్పిస్తున్నాయి.
మోదీ 'పరివర్తన్' నినాదం
ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ ఈసారి బెంగాల్ ఎన్నికలను చావో రేవో అన్నట్లుగా భావిస్తోంది. గత 15 ఏళ్ల తృణమూల్ పాలనలో జరిగిన శాంతిభద్రతల వైఫల్యాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుంది. బెంగాల్ను మళ్లీ 'సోనార్ బంగ్లా'గా మారుస్తామని, యువతకు ఉపాధి కల్పిస్తామని మోదీ తన ర్యాలీల్లో హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా ఓటర్ల జాబితా సవరణ (SIR), అక్రమ వలసల అంశంపై మోదీ ప్రభుత్వం గట్టిగా నిలబడుతోంది. 2021 ఎన్నికల్లో 77 స్థానాలను గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిన బీజేపీ, ఈసారి మమత కోటను బద్దలు కొట్టడానికి మోదీ ఇమేజ్ మంత్రాన్ని నమ్ముకుంది.
ఎవరికి ఎంత అవకాశం
అయితే గత మూడుసార్లు వరుసగా సీఎంగా గెలిచిన టీఎంసీ అధినేత మమత బెనర్జీ మరోసారి విక్టరీ సాధించి, రాష్ట్ర పగ్గాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దీదీ సుదీర్ఘ పాలనలోని అవినీతి ఆరోపణలు, అల్లర్లను ఎత్తిచూపుతూ.. మోదీ ఇమేజ్ తో హిందుత్వ ఓట్లను కొల్లగొట్టి దీదీకి బ్రేక్ వేయాలని బిజేపి గట్టి పట్టుదలతో ఉంది. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఒక్క సీటు కూడా గెలవలేకపోవడంతో, ఈసారి కూడా ప్రధాన పోటీ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యే ఉండబోతోందని స్పష్టంగా తెలుస్తోంది. బెంగాల్ లోని 294 స్థానాలకు గానూ ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుండగా... ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి. మరి వెస్ట్ బెంగాల్ ప్రజలు ఎవరివైపు ఉంటారో, సీఎం పీఠం గెలిచేది ఎవరో మే వరకు వేచి చూడాల్సిందే.






