బెంగాల్ ఎన్నికల వేళ మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు కొంటూ 'దీదీ' సందడి

by Malleboina Mahesh |   (  Updated:2026-04-27 05:27:07  IST  )

బెంగాల్ ఎన్నికల వేళ కూరగాయల మార్కెట్‌లో మమతా బెనర్జీ సందడి! ప్రధాని మోదీని కాపీ కొట్టారంటూ నెటిజన్ల ట్రోలింగ్. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతల వినూత్న ఎత్తుగడలు.

బెంగాల్ ఎన్నికల వేళ మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు కొంటూ దీదీ సందడి
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ వినూత్న పద్ధతిలో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఆదివారం రాత్రి కోల్‌కతాలోని ఒక స్థానిక మార్కెట్‌ను ఆకస్మికంగా సందర్శించిన ఆమె, సామాన్యురాలిలా మారిపోయారు. రోడ్డు పక్కన ఉన్న దుకాణాల వద్ద ఆగి, స్వయంగా కూరగాయలు ఎంపిక చేస్తూ కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆమె కూరగాయల ధరల గురించి వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిని తమ మధ్య చూసిన స్థానికులు, వ్యాపారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మోడీని కాపీ కొట్టారంటూ సెటైర్లు

మమతా బెనర్జీ మార్కెట్ పర్యటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లోని ఝార్‌గ్రామ్‌లో ప్రచారం చేస్తూ, ఒక సాధారణ దుకాణం వద్ద ఆగి పల్లీలు (Jhalmuri) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా అదే తరహాలో రోడ్డు పక్కన కూరగాయలు కొనడం చూస్తుంటే, ఆమె ప్రధాని మోడీని కాపీ కొట్టారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో సామాన్యులకు చేరువయ్యేందుకు నేతలు ఇలాంటి 'స్టంట్స్' చేస్తున్నారని కొందరు విమర్శిస్తుండగా, దీదీ ఎప్పుడూ ప్రజల మనిషేనని ఆమె అభిమానులు సమర్థిస్తున్నారు. ఏది ఏమైనా, బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఈ 'ఫుడ్ పాలిటిక్స్' ఇప్పుడు సరికొత్త రంగును పులుముకున్నాయి.

Next Story