విదేశాల్లో CM రేవంత్.. ముగ్గురు మంత్రులతో డిప్యూటీ CM భట్టి అత్యవసర భేటీ!

by Gantepaka Srikanth |

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

విదేశాల్లో CM రేవంత్.. ముగ్గురు మంత్రులతో డిప్యూటీ CM భట్టి అత్యవసర భేటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రజా భవన్‌లో నలుగురు మంత్రులు అత్యవసరంగా భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం లోక్‌భవన్‌లో ఎట్‌హోం ముగిసిన అనంతరం నలుగురూ ఒకే కారులో ప్రజా భవన్‌కు వెళ్లారు. సింగరేణి అంశం రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు. నైనీ కోల్డ్ టెండర్స్‌పై గవర్నర్‌ను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నలుగురు మంత్రులు అత్యవసరంగా సమావేశం కావడం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

గవర్నర్‌తో బీఆర్ఎస్ భేటీకి కారణమిదే!

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. ముఖ్యంగా సింగరేణి సంస్థలో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తున్నదని.. ఈ భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలవాలని నిర్ణయం తీసుకున్నారు. సింగరేణిలో జరిగిన అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు, లోతైన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌కు సమర్పించనున్నారు. సింగరేణి వంటి ప్రతిష్టాత్మక సంస్థలో జరిగిన ఈ భారీ కుంభకోణంలో సీఎంతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు నేరుగా భాగస్వాములయ్యారని పార్టీ ఆరోపిస్తున్నది. ఈ వ్యవహారంపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర సంపదను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి, ఇంతటి భారీ స్కామ్‌లో భాగస్వాములైన వారికి పదవిలో కొనసాగే నైతిక, రాజ్యాంగ పరమైన హక్కు లేదని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఇదే అంశాన్ని గవర్నర్‌కు తెలియజేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Next Story