Ratan Tata కు భారత రత్న! పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

by Disha Web Desk 17 |
Ratan Tata కు భారత రత్న! పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు
X

న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు భారతరత్న ప్రదానం చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు గురువారం తిరస్కరించింది. ఒక వ్యక్తికి అత్యున్నత గౌరవం ఇచ్చేలా ఆదేశించడం తమ పని కాదని పేర్కొంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. 'ఇది ఎలాంటి పిటిషన్? ఇదేమైనా కోర్టు ఆదేశాలు ఇవ్వాల్సిందా' అని జస్టిస్ నవీన్ చావ్లా అన్నారు. అయితే పిటిషనర్ తరుఫున కౌన్సిల్ కనీసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని కోరారు. 'వెళ్లి విజ్ఞప్తి చేసుకొండి. కోర్ట్‌కు రావాల్సిన అవసరమేముంది' అని తాత్కాలిక న్యాయమూర్తి ప్రశ్నించారు. ఒకవేళ కోర్టు కొట్టి వేయాల్సి వస్తే ఖర్చులు భరించాల్సి ఉంటుందని పేర్కొనడంతో రాకేష్ అనే పిటిషనర్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దేశానికి చేస్తున్న సేవలకు గానూ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని ఆయన ప్రజావాజ్యం వేశారు.

Next Story