ఘోర బోటు ప్రమాదం.. 10 కి చేరిన మృతుల సంఖ్య

by Muthe.Rajitha |

యూపీ బృందావన్ లో శుక్రవారం జరిగిన ఘోర బోటు ప్రమాదంలో మృతుల సంఖ్యా 10 కి చేరింది.

ఘోర బోటు ప్రమాదం.. 10 కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ లో శుక్రవారం జరిగిన బోటు ప్రమాదం అత్యంత విషాదాన్ని నింపింది. యమునా నదిలోని కేసీ ఘాట్ సమీపంలో పర్యాటకులు, భక్తులతో ప్రయాణిస్తున్న బోటు ప్రమాదానికి గురవడంతో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది పంజాబ్ రాష్ట్రం నుండి తీర్థయాత్రకు వచ్చిన వారేనని ప్రాథమిక సమాచారం.

ప్రమాదం జరిగిన తీరు, కారణాలు

కేసీ ఘాట్ వద్ద సుమారు 25 నుండి 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటు, నదిలో ఉన్న పోంటూన్ బ్రిడ్జ్‌ను బలంగా ఢీకొట్టి తలక్రిందులైంది. బలమైన గాలుల కారణంగా బోటుపై నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు, బోటు ఓవర్‌లోడ్ వల్ల కూడా త్వరగా మునిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా బోటులో ఏ ఒక్కరికీ లైఫ్ జాకెట్స్ లేకపోవడం వల్ల మృతుల సంఖ్య భారీగా ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక డైవర్లు, పోలీసులు రంగంలోకి దిగి కొందరిని రక్షించారు. గాయపడిన వారందరినీ మథురాలోని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన వారి కోసం NDRF, SDRF బృందాలతో పాటు ఆర్మీ టీములు కూడా యమునా నదిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

మథురా జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ విషాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతో పాటు, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా ప్రమాదానికి ముందు బోటులోని వారంతా సంతోషంగా భజన చేస్తున్న వీడియో కన్నీళ్లు పెట్టిస్తోంది.

Next Story