కలవర పెడుతున్న క్రషర్లు.. గుండెలు బాదుకుంటున్న రైతన్నలు

by Dishafeatures2 |
కలవర పెడుతున్న క్రషర్లు.. గుండెలు బాదుకుంటున్న రైతన్నలు
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: బడా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, శ్రీమంతులు ఏర్పాటు చేసుకుని సొమ్ము చేసుకుంటున్న క్రషర్లు ఆ ఊరి రైతుల పాలిట శాపంగా మారాయి. క్రషర్లతో తమ జీవితాలే ఆగమైపోతున్నాయని రైతులు గుండెలు బాదుకుంటున్నారు. సాగు చేసిన పంటలపై పడిన దుమ్ముతో పంటలు ఎదగలేక తీవ్రంగా నష్టపోతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దీనికి తోడు రాత్రింబవళ్లు భారీ శబ్ధాలతో సమీప ఇండ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. వందలాది లారీలు తిరుగుతుండడంతో దుమ్ముతో పాటు రోడ్లూ పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. ఈ క్రషర్ల కారణంగా హైదరాబాద్​కు సమీపంలోనే ఉన్నప్పటికీ వెంచర్లు, విల్లాలు, అపార్ట్ మెంట్ల నిర్మాణానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీనితో ఈ ప్రాంతం ఓ ఎడారిలా మారిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊరు చుట్టూ ఏర్పాటు చేసిన క్రషర్లు మా చావుకే పెట్టారంటూ పటాన్​చెరు మండలం లకుడారం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద వాళ్లకు చెందిన క్రషర్లు కావడంతో ఏమనలేని పరిస్థితులు ఉన్నాయంటున్నారు. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న క్రషర్లపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఉన్నవాటికి తోడుగా మరో 10 కొత్త క్రషర్లు..

ఔటర్​ రింగు రోడ్డుకు అతి సమీపంలో పటాన్​చెరు మండలం లకుడారం గ్రామం పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేవి క్రషర్లు. ఊరు చుట్టూ గుట్టలు ఉండడంతో పెద్ద ఎత్తున ఇక్కడ క్రషర్లు ఏర్పాటు చేసి కంకర, రాయి, డస్ట్ వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ గ్రామ పరిధిలో ప్రస్తుతం 14 వరకు క్రషర్లు పనిచేస్తున్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. 24 గంటల పాటు క్రషర్లు నడుస్తూనే ఉంటాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే 14 క్రషర్లు కొనసాగుతుండగా ఇంకా కొత్తగా ఏర్పాటు చేసుకోవడానికి పెద్ద ఎత్తున ధరఖాస్తులు కూడా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మరో 10 క్రషర్లు కొత్తగా ఏర్పడనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొత్తవి ఏర్పడితే మొత్తం క్రషర్ల సంఖ్య 24కు పెరగనున్నది. ఇప్పటికే క్రషర్లతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా కొత్తగా అనుమతులు ఇవ్వడంపై ఏ విధంగా స్పందించనున్నారో వేచి చూడాలి.


నిబంధనలకు పాతర, రోడ్లపై లారీల జాతర

ప్రజా ప్రతినిధులు, పేరు పొందిన వాళ్లు క్రషర్లు నిర్వహిస్తుండడంతో నిబంధనలు పాటించకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక క్రషర్​కు అనుమతి తీసుకుని రెండు, మూడు అనధికారికంగా నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 5 నుంచి 10 ఏండ్ల వరకు లీజు తీసుకుంటున్న నిర్వహకులు రికార్డుల్లో తక్కువ భూమి లెక్కలు చెప్పి అనధికారికంగా పక్కన భూమిలో కూడా క్రషర్లు నడుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రోజు వారిగా వందలాది లారీలు కంకర సరఫరాకు రోడ్లపై తిరుగుతుండడంతో దుమ్ము వస్తుంది. ఇలా దుమ్ము రాకుండా రోడ్లపై నీళ్లు పోయించాలని ఆదేశాలున్నాయి. కానీ వాటిని ఎవరూ పాటించడం లేదు. కంకర, డస్ట్ లారీల్లో తరలిస్తున్న సమయంలో దానిపై తాటిపత్రి(కవర్​) కప్పి పెట్టాల్సి ఉంటుంది. కానీ లారీల వాళ్లు అలాగే తరలిస్తుండడంతో వెనక వచ్చే వాహనాలపై డస్ట్ పడుతుంది. భారీ లోడుతో లారీలు వెలుతుండడంతో రోజుల వ్యవధిలోనే రోడ్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయి. గుంతలు ఏర్పడి దుమ్ములో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దుమ్ముతో లకుడారంలో ప్రధానంగా వృద్ధులు, పిల్లలకు శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా ప్రతినిధులు, లీడర్లవే..

లకుడారంలో ఏర్పాటు చేసిన క్రషర్లు అన్నీ ప్రజా ప్రతినిధులు, లీడర్లవే కావడం గమనార్హం. స్టేజీల మీద గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చే వారు ఇక్కడ గ్రామస్తులు, రైతుల ఇబ్బందులను మాత్రం పట్టించుకోవడం లేదు. 2వేల ఎకరాల్లో పచ్చని పంటలతో కళకళలాడిన పల్లె ఇప్పుడు ఎడారిగా మారడానికి కారణం ఎవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు పట్టించుకోరు, ప్రశ్నించిన వారిని బెదిరిస్తుంటారు. దుమ్ము లేవకుండా రోడ్లపై విధిగా నీళ్లు ఎందుకు పోయడం లేదు..? పంటలు సాగు చేయకుండా వ్యవసాయానికే దూరం అవుతున్న రైతులను ఎవరు ఆదుకోవాలి..? దుమ్ముతో వ్యాధుల బారిన పడుతున్న వృద్ధులు, పిల్లల పరిస్థితి ఏమిటీ..? అని గ్రామస్తులు క్రషర్లు నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులను సూటిగా ప్రశ్నిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఇక్కడ లీడర్లకు క్రషర్లు ఉన్నట్లు తెలుస్తోంది. లకుడారం చుట్టపక్కల అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున వెంచర్లు వెలుస్తున్నాయి. అపార్ట్‌మెంట్లు, విల్లాలు నిర్మిస్తున్నారు. ఈ ఊరు వైపు మాత్రం ఎవరూ రావడం లేదు. ఉన్న ఇళ్లే క్రషర్ల బాంబు పేలుళ్లకు పగుళ్లు వస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిటీ శివారులోనే ఉన్నప్పటికీ ఇళ్ళ నిర్మాణానికి, వ్యవసాయానికి పనికి రాకుండా పోయిన ఇక్కడి భూములను చూస్తూ రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. క్రషర్లతో తమ భూములకు ధరలు పలకడం లేదంటున్నారు.


వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం

ఊర్లో క్రషర్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దుమ్ముతో కొత్త రోగాలు వస్తున్నాయి. ఎన్నో సార్లు కలెక్టర్లు, అధికారులకు ఫిర్యాదులు చేశాం. పర్యావరణం పూర్తిగా కలుషితమైంది. డస్ట్‌తోనే వ్యాధులు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇక్కడున్న అన్ని క్రషర్లు లీడర్లవే. అన్ని పార్టీల వారివి ఉన్నాయి. వారిని ఎవరు ఏమనలేని పరిస్థితి ఉన్నది. కాయకష్టం చేసి ఇళ్లు నిర్మించుకుంటే బాంబు పేలుళ్లతో పగుళ్లు వస్తున్నాయి. దుమ్ముతో పంటలు పండడం లేదు. ఈ క్రషర్లతో నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇవి ఇక్కడి నుంచి వెళ్లిపోతే ఊరంత పండుగ చేసుకుంటాం. అధికారులు మా బాధలు అర్థం చేసుకోవాలి' అని లకుడారం మాజీ వార్డు సభ్యుడు, రైతు గోపాల్ రెడ్డి అన్నారు.

ఊరు వదిలిపెట్టే పరిస్థితి వచ్చింది..

'క్రషర్లతో మేము లకుడారం ఊరే వదిలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కొత్త ఇండ్లు నిర్మాణం చేసుకోలేం. పంటలు సాగు చేయలేం. ఇక్కడే ఉంటే రోగాలు తప్పవు. ఇంకా ఏం చేస్తాం. వందల లారీలు తిరుగుతున్నాయి. రోడ్ల మీదకు వెళితే కనిపించకుండా దుమ్ము. ఏ పంటలు వేసిన దుమ్ము పడి ఎదగలేపోతున్నాయి. అన్ని విధాలుగా ఆగమైపోతున్నాం. మాకు పక్కనే ఉన్న ఊర్లలో రియల్​వ్యాపారం జోరుగా సాగుతున్నది. అపార్ట్ మెంట్లు కడుతున్నారు. మా ఊరు పేరు చెబితే ఎవరూ రావడం లేదు. మా బాధలు ప్రభుత్వమే పట్టించుకోవాలి' అని లకుడారం రైతు శ్రీనివాస్ రెడ్డి కోరారు.


Next Story

Most Viewed