కాంగ్రెస్ ప్రభుత్వంపై CPM కార్యదర్శి జాన్ వెస్లీ ఫైర్

by Gantepaka Srikanth |

జాబ్‌ నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఈనెల 31న ఇందిరా పార్కు వ‌ద్ద తెలంగాణ నిరుద్యోగ జేఏసీ త‌ల‌పెట్టిన నిరుద్యోగుల సింహ‌గ‌ర్జన‌కు మ‌ద్ద‌తిస్తున్న‌ట్టు సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్‌వెస్లీ ప్ర‌క‌టించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై CPM కార్యదర్శి జాన్ వెస్లీ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాబ్‌ నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఈనెల 31న ఇందిరా పార్కు వ‌ద్ద తెలంగాణ నిరుద్యోగ జేఏసీ త‌ల‌పెట్టిన నిరుద్యోగుల సింహ‌గ‌ర్జన‌కు మ‌ద్ద‌తిస్తున్న‌ట్టు సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్‌వెస్లీ ప్ర‌క‌టించారు. దానికి సంబంధించిన పోస్ట‌ర్‌ను శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాల‌యం(ఎంబీభ‌వ‌న్‌)లో ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోనే 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించి ఆ మాట‌ను నిల‌బెట్టుకోలేద‌ని విమ‌ర్శించారు. ఏటా విడుద‌ల చేస్తామ‌న్న జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌స్తావ‌న లేద‌ని తెలిపారు. పోస్టులు భ‌ర్తీ చేస్తార‌నే ఆశ‌తో విద్యార్థులు కోచింగ్‌లు వెళ్తున్నార‌నీ, స్ట‌డీ హాళ్ల‌లో రేయింబ‌వ‌ళ్లు చ‌దువుతున్నార‌ని, నోటిఫికేష‌న్లు రాక వారు నైరాశ్యంలోకి కూరుకుపోతున్నార‌నీ తెలిపారు. ఆర్థికప‌ర‌మైన ఇబ్బందుల‌ను సైతం ఎదుర్కొంటున్నార‌ని వాపోయారు. ప్ర‌భుత్వం ఇస్తాన‌న్న నిరుద్యోగ భృతి ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం ఇచ్చిన హామీ మేర‌కు ఏటా జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేయాలనీ, ప్ర‌భుత్వ శాఖ‌ల్లోని ఖాళీల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్య‌క్షులు కోట ర‌మేశ్‌, ఎస్ఎఫ్ఐ న‌గ‌ర కార్య‌ద‌ర్శి అశోక్‌రెడ్డి, సీపీఎం నాయ‌కులు ఉడుత ర‌వీంద‌ర్‌, విజ‌య్‌కుమార్‌, నిరుద్యోగ జేఏసీ నేత‌లు మోతీలాల్ నాయ‌క్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story