అక్రమ వెంచర్ పై విచారణ చేపట్టాలి.. మున్సిపల్ కమిషనర్‌కు సీపీఐ ఫిర్యాదు

by Jakkula.Mamatha |

వెంపటి రామకోటయ్య పేరుతో వేసిన అక్రమ వెంచర్‌కు అనుమతులు పొందినందుకే వెంపటి సురేష్ అధికార పార్టీలో చేరారని సీపీఐ జిల్లా సమితి సభ్యుడు చెరుకుపల్లి భాస్కర్ ఆరోపించారు.

అక్రమ వెంచర్ పై విచారణ చేపట్టాలి.. మున్సిపల్ కమిషనర్‌కు సీపీఐ ఫిర్యాదు
X

దిశ , ఖమ్మం రూరల్: వెంపటి రామకోటయ్య పేరుతో వేసిన అక్రమ వెంచర్‌కు అనుమతులు పొందినందుకే వెంపటి సురేష్ అధికార పార్టీలో చేరారని సీపీఐ జిల్లా సమితి సభ్యుడు చెరుకుపల్లి భాస్కర్ ఆరోపించారు. శనివారం ఎదులాపురం మున్సిపాలిటీ 29వ వార్డులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాల్వలను ఆక్రమించి వాటిని డీటీసీపీ వెంచర్‌లో కలిపేశారని, అంతేకాకుండా గ్రామ పంచాయతీ లేఔట్‌లో ఉన్న మూడు ప్లాట్లను కూడా అదే వెంచర్‌లో చేర్చారని భాస్కర్ ఆరోపించారు. వెంచర్‌కు అవసరమైన 60 అడుగుల రహదారి లేకపోయినా ఉన్నట్లు చూపించి అనుమతులు పొందేందుకు ప్రయత్నించారని తెలిపారు. నాలుగు సంవత్సరాల నుంచి అధికారులు ఎటువంటి పర్మిషన్లు ఇవ్వలేదని, కానీ ఇప్పుడు అధికారులను తప్పుదోవ పట్టించి పొందిన టిఎల్పీని తక్షణమే రద్దు చేసి పంట కాలువను పునరుద్ధరించాలని కోరారు. ఏర్పాటుచేసిన వెంచర్ కింది భాగంలో కాలవలు అలానే ఉన్నాయని, ఆ వెంచర్‌లోకి వచ్చేసరికి మాత్రం మాయం అయ్యాయన్నారు.

వెంచర్‌కు రేరా ఆమోదం పొందినట్లు ప్రచారం చేస్తున్నప్పటికీ, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎక్కడా ప్రదర్శించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసే ప్రజలు భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై హైదరాబాద్‌లోని డీటీసీపీ, రేరా కార్యాలయాలకు ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం సీపీఐ నాయకులు మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేసి, కాల్వల ఆక్రమణలు మరియు వెంచర్ అనుమతుల వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యుడు వెంపటి సురేందర్‌, 28 32 వార్డుల సిపిఐ కౌన్సిలర్లు దండి రంగారావు మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి, సిపిఐ నాయకులు వెన్నం భాస్కర్, వెంపటి రాము, మిరియాల వరుణ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story