Municipal Elections: ఆ ఇద్దరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?.. ఓటు ఎవరికి వేయాలి?

by Gantepaka Srikanth |

మున్సిపల్ ఎన్నికల వేళ మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Municipal Elections: ఆ ఇద్దరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?.. ఓటు ఎవరికి వేయాలి?
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల వేళ మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి(Jeevan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగిత్యాలలో కాంగ్రెస్ నేతలు ఎవరికి ఓటు వేయాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో, కానీ అభ్యర్థులు ఎవరో కార్యకర్తలకు తెలియని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు, కాంగ్రెస్ వలసవాదులకు మధ్య పోటీ నెలకొందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోయే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి సంజయ్ పరిశీలించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కూడా సంజయ్‌ని గాంధీ భవన్‌కు పిలిచి క్రమశిక్షణ తప్పారని హాట్ కామెంట్స్ చేశారు.

బుజ్జగింపులు ఫలించకపోతే...

మరోవైపు.. నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనుండటంతో కాంగ్రెస్ బీ-ఫామ్స్ ఎవరికి దక్కుతాయోనన్న ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. మెజారిటీ వార్డుల్లో రెండు వర్గాలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో వారిని బుజ్జగించడం నాయకులకు తలనొప్పిగా మారింది. పార్టీలు అధికారికంగా ఎవరికి మద్దతు తెలుపుతాయో తెలియక అభ్యర్థులు టెన్షన్‌లో ఉండగా, రెబల్ అభ్యర్థులు వెనక్కి తగ్గకపోవడం సమీకరణాలను మారుస్తోంది. బుజ్జగింపులు ఫలించకపోతే స్వతంత్రులుగానైనా పోటీ చేస్తామని పలువురు ఆశావహులు భీష్మించుకుంటున్నారు. గడువు ముగిసిన తర్వాతే అసలైన అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి జగిత్యాల పట్టణమంతా ఎన్నికల వ్యూహాలు, బీ-ఫామ్స్ లెక్కలతో అట్టుడుకుతోంది.

Next Story