ఐదు గ్యారంటీలతో అస్సాం బరిలో కాంగ్రెస్

by Muthe.Rajitha |

అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ "ఐదు గ్యారంటీలు" పేరుతో సంక్షేమ పథకాలను ప్రకటించింది.

ఐదు గ్యారంటీలతో అస్సాం బరిలో కాంగ్రెస్
X

దిశ, వెబ్ డెస్క్ : అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ "ఐదు గ్యారంటీలు" (Five Guarantees) పేరుతో సంక్షేమ పథకాలను ప్రకటించింది. ఆదివారం లఖింపూర్ జిల్లాలోని నౌబోయిచాలో జరిగిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ కీలక ప్రకటనలు చేశారు. గతంలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు విజయాన్ని అందించిన "గ్యారంటీ మోడల్"నే ఇప్పుడు అస్సాం ఎన్నికల్లోనూ అస్త్రంగా వాడుతోంది.

కాంగ్రెస్ ప్రకటించిన ఐదు గ్యారంటీలు

మహిళల ఆర్థిక స్వావలంబన: రాష్ట్రంలోని ప్రతి మహిళా లబ్ధిదారుకు బ్యాంక్ ఖాతాలో ఎటువంటి షరతులు లేకుండా ప్రతి నెలా నగదు జమ చేస్తారు. దీనికి అదనంగా, సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలనుకునే మహిళలకు రూ. 50,000 ఆర్థిక సహాయం అందిస్తారు.

నగదు రహిత ఆరోగ్య భీమా: అస్సాంలోని ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల వరకు వర్తించేలా క్యాష్‌లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తారు. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల నుండి భారీ ఉపశమనం కలిగించనుంది.

భూమి పట్టాలు : అస్సాం స్థానికతను కాపాడటంలో భాగంగా, సుమారు 10 లక్షల మంది మూలవాసులకు (Indigenous people) శాశ్వత భూమి పట్టాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. దశాబ్దాలుగా భూమి హక్కుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది కీలకమైన హామీ.

సామాజిక భద్రత పెన్షన్ : రాష్ట్రంలోని వృద్ధులందరికీ సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రతి నెలా రూ. 1,250 వృద్ధాప్య పింఛను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తారు.

జుబీన్ గార్గ్ కేసు: అస్సాం ప్రజల ఆరాధ్య గాయకుడు జుబీన్ గార్గ్ మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించి, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బాధ్యులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సంచలన హామీ ఇచ్చారు. ఇది అస్సామీ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశాన్ని కాంగ్రెస్ ఓటుతో ముడిపెట్టి చూస్తోందని తెలుస్తోంది.

అస్సాంలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కాంగ్రెస్ ఈ సంక్షేమ పథకాలను ప్రధాన అస్త్రాలుగా మలుచుకుంది. ఖర్గే తన ప్రసంగంలో ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఈ గ్యారంటీలు కేవలం ఎన్నికల హామీలు మాత్రమే కావని, ఇవి ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ 'గ్యారంటీ కార్డు' విధానం అస్సాం ఓటర్లను ఎంతవరకు ఆకర్షిస్తుందో వేచి చూడాలి.

Next Story