నేడు నగరానికి చేరుకోనున్న CM రేవంత్ రెడ్డి.. మంత్రులతో సెక్రటేరియట్‌లో కీలక భేటీ!

by Kema Shiva Kumar |

విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఇవాళ రాత్రికి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

నేడు నగరానికి చేరుకోనున్న CM రేవంత్ రెడ్డి.. మంత్రులతో సెక్రటేరియట్‌లో కీలక భేటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఇవాళ రాత్రికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. దాదాపు రెండు వారాల పాటు స్విట్జర్లాండ్‌లోని దావోస్ (Davos), అమెరికా (America)లో పర్యటించిన ఆయన, రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University)లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణ ప్రతినిధి బృందం పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షించింది. గూగుల్, యూనీలీవర్ వంటి దిగ్గజ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. తెలంగాణను 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో సీఎం పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా హార్వర్డ్ కెన్నడీ స్కూల్‌లో ‘21వ శతాబ్దపు నాయకత్వం’ అనే అంశంపై ముఖ్యమంత్రి ప్రత్యేక కోర్సును పూర్తి చేశారు. ఈ ఘనత సాధించిన అతి కొద్దిమంది భారతీయ ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డి ఒకరుగా నిలిచారు.

మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష..

ముఖ్యమంత్రి నగరానికి చేరుకున్న వెంటనే పాలన, రాజకీయాలపై దృష్టి సారించనున్నారు. ఫిబ్రవరి 2న మధ్యాహ్నం సచివాలయం (Secretariat)లో మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై సీఎం చర్చించనున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచార బాధ్యతలు మరియు గెలుపు గుర్రాలపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 3 నుంచి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జిల్లాల్లో పర్యటించి, మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది.

Next Story