రెండు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన CM రేవంత్.. కేటీఆర్ హర్షం

by Gantepaka Srikanth |

ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హాతీఘాట్ గ్రామం వద్ద చనాక - కొరాట పంప్ హౌస్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

రెండు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన CM రేవంత్.. కేటీఆర్ హర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హాతీఘాట్ గ్రామం వద్ద చనాక - కొరాట పంప్ హౌస్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ప్రధాన కాలువల నుంచి నీటిని విడుదల చేశారు. అయితే.. ఈ ప్రాజెక్టు ప్రారంభంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ప్రారంభమై, 90% పైగా పనులు పూర్తిచేసుకున్న రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవాళ ప్రారంభం కావడం సంతోషదాయకమని కేటీఆర్(KTR) పేర్కొన్నారు. 0.98 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో నిర్మించిన ఈ బరాజ్ బీఆర్ఎస్ హయాంలోనే 95% పనులు పూర్తయ్యి, సెప్టెంబర్ 2023లో ట్రయల్ రన్ కూడా అయ్యింది. దీనిలో భాగమైన లిఫ్ట్ ఇరిగేషన్ కాంపొనెంట్‌తో కలిపి, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గల్లోని 89 గ్రామాలకు చెందిన సుమారు 51,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. 2016లో మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకుని మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇది అని కేటీఆర్ వెల్లడించారు.

మరోవైపు జగిత్యాల జిల్లాల్లోని గోదావరి నదిపై నిర్మించిన సదర్‌మాట్ బ్యారేజ్‌ను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీనిపైనా కేటీఆర్ స్పందిస్తూ.. ‘ఈ ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్ధ్యం 1.58 టీఎంసీలు. కేసీఆర్ హయాంలోనే 90% ప్రాజెక్టు పూర్తయ్యింది. నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని 18,000 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తుంది. కేసీఆర్ పాలనలో తెలంగాణ దశాబ్ది (2014-2023), నెర్రెలుబారిన ఈ నేలను దేశానికి ధాన్యాగారంగా మార్చింది’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

Next Story