ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ..

by Disha Web Desk 19 |
ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ..
X

దిశ, తెలంగాణ బ్యూరో: వడ్ల కొనుగోళ్ళపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ నెలకొన్న సమయంలో ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాత్రి లేఖ రాశారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వరి, గోధుమ ధాన్యాన్ని కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ పూర్తి స్థాయిలో కొంటున్నదని, కానీ తెలంగాణ విషయంలో మాత్రం వివక్ష చూపుతున్నదని, ఇలాంటి విధానాలు మంచిది కాదని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి సౌకర్యం కల్పించడంతో పంటల విస్తీర్ణం పెరిగిందని, ప్రతీ వరి గింజను కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని నొక్కిచెప్పారు. జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని 2013లో రూపొందించుకున్నప్పుడు ధాన్య సేకరణ, ఆహార భద్రత బాధ్యతలను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

దేశ ఆర్థిక ప్రగతిలో వ్యవసాయ శాఖ కీలకమైనదని, ఒకవైపు వనరులను సమకూర్చడం మాత్రమే కాక వివిధ రకాల ఉత్పత్తులకు వినియోగదారుగా కూడా ఉన్నదని, సగం జనాభా ఈ రంగంపై ఆధారపడే బతుకుతున్నారని కేసీఆర్ నొక్కిచెప్పారు. రైతు అనుకూల నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆ రంగానికి, దేశ ప్రగతికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిన తర్వాత రైతుల ఆందోళనకు కేంద్రం తలొంచక తప్పలేదని, చివరకు ఆ చట్టాలను రద్దు చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. జాతీయ స్థాయిలో ధాన్య సేకరణకు ఒకే విధానం ఉండడం ద్వారా మాత్రమే రాష్ట్రాలకు, రైతులకు అన్యాయాన్ని నివారించవచ్చునని అన్నారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయ నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని విధాలా శ్రేయస్కరమైన పాలసీని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ విషయంలోనూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు. దురదృష్టవశాత్తూ రెండేళ్ళుగా వరి సేకరణలో కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ తీరు నిరుత్సాహకరంగా ఉన్నదని పేర్కొన్నారు. కనీస మద్దతు ధర చట్టాన్ని అమలు చేస్తున్నా రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో సేకరించకపోతే ఆ నిర్ణయానికి అర్థమే ఉండదన్నారు. ఆహార భద్రత, మద్దతు ధర అమలు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన గుర్తుచేశారు. రైతులను పంటల మార్పిడి దిశగా తెలంగాణ ప్రభుత్వం డ్రైవ్ చేస్తున్నదని, ఆ కారణంగానే 2021 రబీ సీజన్‌లో 52 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగైతే ఈసారి అది 36 లక్షల ఎకరాలకు తగ్గిందని గుర్తుచేశారు.

పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల విధానం ఒక్కసారిగా రైతుల్లో మార్పు తీసుకురావడానికి వీలు పడదని, క్రమంగా అలవాటయ్యేంత వరకు వరి ధాన్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సేకరించాల్సి ఉంటుందని, ఆ బాధ్యతను గుర్తుచేయాల్సి వస్తున్నదని లేఖలో కేసీఆర్ నొక్కిచెప్పారు.


Next Story

Most Viewed