ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

by Malleboina Mahesh |

పెండింగ్‌లో ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం చంద్రబాబు ఆమోదం. జిల్లా స్థాయిలో కుదరని పక్షంలో క్యాబినెట్‌కు తీసుకురావాలని ఆదేశాలు.

ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ (Regularisation) వ్యవహారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సచివాలయంలోని ఆర్టీజీ (RTG) సెంటర్ నుంచి వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు పై ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఈ సమస్యలను ఎంతవరకు పరిష్కరించగలరో అంతవరకు అక్కడే పూర్తి చేయాలని, ఒకవేళ జిల్లా స్థాయిలో క్రమబద్ధీకరణ సాధ్యం కాని పక్షంలో ఆయా అంశాలను తదుపరి నిర్ణయం కోసం నేరుగా కేబినెట్ (మంత్రివర్గ) సమావేశానికి తీసుకురావాలని స్పష్టం చేశారు.

ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న పూర్తి సమాచారాన్ని, నివేదికలను వెంటనే జిల్లా కలెక్టర్ల నుంచి సేకరించాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు సూచించారు. ఆర్టీజీ సెంటర్ వేదికగా జరిగిన ఈ సుదీర్ఘ సమీక్ష సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి శ్రీ కె. పార్థసారధి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) శ్రీ సాయి ప్రసాద్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది ప్రజలకు పెద్ద ఉపశమనం లభించనుంది.

Next Story