ఆసియా వేదిక పై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన సీకే తైక్వాండో క్లబ్

by Batti.Sumithra |

అంతర్జాతీయ తైక్వాండో వేదిక పై భారత క్రీడాకారులు మరోసారి తమ సత్తా చాటారు.

ఆసియా వేదిక పై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన సీకే తైక్వాండో క్లబ్
X

దిశ, చంపాపేట్ : అంతర్జాతీయ తైక్వాండో వేదిక పై భారత క్రీడాకారులు మరోసారి తమ సత్తా చాటారు. 9వ ఆసియన్ కప్ ఓపెన్ ఇంటర్నేషనల్ తైక్వాండో ఛాంపియన్‌షిప్–2026లో సీకే తైక్వాండో క్లబ్ ఇండియా క్రీడాకారులు అసాధారణ ప్రతిభ కనబరిచి మొత్తం 16 స్వర్ణ, 7 రజత, 11 కాంస్య పతకాలతో కలిపి 34 పతకాలను కైవసం చేసుకుని భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. ఈ పోటీల్లో క్లబ్‌కు చెందిన వివిధ బ్రాంచ్‌ల క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ ప్రతి విభాగంలో విజయ పతాకం ఎగుర వేశారు. ముఖ్యంగా సైదాబాద్ బ్రాంచ్‌కు చెందిన ఎనిమిది మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుతూ విశేష విజయాలు సాధించారు.

షేక్ హమ్జా అద్నాన్, తేజ వర్ధన్, షేక్ సనా మహిన్ స్వర్ణ పతకాలను గెలుచుకుని భారత జెండాను ఆసియా వేదిక పై రెపరెపలాడించగా, వంశీ కృష్ణ, కావేటి ఆయ్వుక్త్, అభిషేక్ రజత పథకాలు సాధించారు. కావేటి ఆరుష్, శశి రిత్విక్ కాంస్య పతకాలను కైవసం చేసుకుని క్లబ్‌కు మరింత కీర్తి తీసుకొచ్చారు. ఈ విజయాల వెనుక క్లబ్ హెడ్ కోచ్ వంశీ కృష్ణ, మేనేజర్ రాకేష్, కోచ్‌లు మహాదేవ్, రాహుల్‌తో పాటు మహిళా కోచ్ సిమ్రన్ అందించిన కఠిన శిక్షణ, నిరంతర మార్గదర్శకత్వం, క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కృషి కీలక పాత్ర పోషించిందని క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా విజేతలను అభినందించిన క్రీడా ప్రముఖులు, తల్లిదండ్రులు మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదిక పై భారతదేశానికి పతకాలు సాధించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని పేర్కొన్నారు. యువత క్రీడలను కెరీర్‌గా ఎంచుకుని దేశానికి మరిన్ని విజయాలు అందించాలని ఆకాంక్షించారు. సీకే తైక్వాండో క్లబ్ సాధించిన ఈ ఘన విజయం భారత తైక్వాండోకు కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు, తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న యువ క్రీడాకారుల ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.

Next Story