వాహన అమ్మకాలను దెబ్బతీసిన సెమీకండక్టర్ల కొరత!

by Web Desk |
వాహన అమ్మకాలను దెబ్బతీసిన సెమీకండక్టర్ల కొరత!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆటో పరిశ్రమకు సెమీకండక్టర్(చిప్)ల కొరత వెంటాడుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దిగ్గజ వాహన తయారీ కంపెనీల ఉత్పత్తులు నెమ్మదించడంతో వాహనాల విక్రయాల గణాంకాలు మిశ్రమంగా నమోదయ్యాయి. మారుతి సుజుకి, హ్యూండాయ్, టయోటా, హోండా కంపెనీల అమ్మకాలు తగ్గిపోగా, టాటా మోటార్స్, మహీంద్రా, స్కోడా, ఎంజీ మోటార్ కంపెనీల హోల్‌సేల్ విక్రయాలు పెరిగాయి. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అమ్మకాలు దేశీయంగా ఫిబ్రవరిలో 1,52,983 యూనిట్ల నుంచి 8.46 శాతం తగ్గి 1,40,035 యూనిట్లకు పడిపోయాయి. దేశీయ రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యూండాయ్ 14.6 శాతం క్షీణతతో 44,050 యూనిట్లను విక్రయించింది. టయోటా సైతం సమీక్షించిన నెలలో 38 శాతం అమ్మకాల తగ్గుదలతో 8,745 యూనిట్లను విక్రయించింది. హోండా అమ్మకాలు 23 శాతం దెబ్బతిని 7,187 యూనిట్లుగా నమోదు చేసింది. పరిశ్రమలో సెమీకండక్టర్ల కొరత వెంటాడుతోందని, వినియోగదారులకు సరైన సమయంలో కార్లను సరఫరా చేయలేక పోయినట్టు కంపెనీలు వెల్లడించాయి. అయితే, టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ కారణంగా 47 శాతం అమ్మకాల వృద్ధితో 39,981 యూనిట్లను విక్రయించింది. ఎస్‌యూవీల అమ్మకాలు 79 శాతం పెరిగాయని కంపెనీ తెలిపింది. స్కోడా ఆటో ఇండియా 4,503 యూనిట్ల అమ్మకాలతో ఐదు రెట్ల వృద్ధిని సాధించింది. ఎంజీ మోటార్స్ సైతం 5 శాతం పెరుగుదలతో 4,528 యూనిట్లను అమ్మింది. నిస్సాన్ ఇండియా గత నెలలో 2,456 యూనిట్లను విక్రయించినట్లు వెల్లడించింది. ద్విచక్ర వాహన విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ స్వల్పంగా 0.54 శాతం వృద్ధితో గత నెల 59,160 యూనిట్లను విక్రయించింది. టీవీఎస్ 5 శాతం పడిపోయి 2,81,714 యూనిట్లుగా అమ్ముడయ్యాయి. కమర్షియల్ వాహనాల్లో అశోక్ లేలాండ్ అమ్మకాలు 5.5 శాతం పెరిగి 14,657 యూనిట్లను విక్రయించింది. ఎక్సార్ట్స్ వాహనాల అమ్మకాలు 7.13 శాతం పెరిగి 6,114 యూనిట్లుగా నమోదయ్యాయి.



Next Story

Most Viewed