కేసముద్రం మార్కెట్‌లో మిర్చి రైతుల కన్నెర్ర..

by Disha Web |
కేసముద్రం మార్కెట్‌లో మిర్చి రైతుల కన్నెర్ర..
X

దిశ, కేసముద్రం : మిర్చి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని మిర్చి రైతులు కన్నెర్ర చేశారు. కేసముద్రం మార్కెట్ వద్ద మిర్చి రైతులు ఆందోళన బాట పట్టారు. గిట్టుబాటు ధర కల్పించాలని వారు మార్కెట్ యార్డ్ వద్ద బుధవారం ధర్నాకు దిగారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని గిట్టుబాటు ధర కోసం రైతులు ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.

తేజ మిర్చి పంటకు రూ.17వేలు ధర పలికినప్పటికీ కేసముద్రం మార్కెట్లో రూ.9వేల నుంచి రూ.13వేల వరకు మాత్రమే మిర్చి పంటను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అంతేకాక అమాయక రైతులను చూసి వారు మిర్చికి ఆన్లైన్లో ఇచ్చిన ధర కాకుండా దానిని మార్చి వేరే ధరకు మిర్చి కొనుగోలు చేస్తున్నారని తమకు న్యాయం చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.


అంతేకాకుండా రైతులను మోసం చెయ్యాలని చూసిన వ్యాపారిపై రైతులు దాడి చేశారు. చదువురాని అమాయక అన్నదాతలను మోసం చేస్తున్నారని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణ రావు, ఎస్ఐ రమేశ్ బాబు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో వ్యాపారులతో చర్చలు జరిపారు. మిర్చి నాణ్యత చూసి మరోసారి ధరలను పునఃసమీక్షించాలని, ధరలను సవరించాలని రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని ఆదేశించారు. దీంతో సమస్య సద్దుమణిగింది.

మిర్చి పంటకు తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గింది..

మిర్చి రైతులు ఇప్పటికే ఆరుగాలం పండించిన పంట చేతికి రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈసారి అకాల వర్షాలు, మిర్చి పంటకు తెగుళ్ల కారణంగా దిగుబడి చాలా తక్కువ వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో కూడా గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని మిర్చి రైతులు వాపోతున్నారు. కనీస మద్దతు ధర చెల్లించకుండా వ్యాపారులు దోచుకోవడాన్ని అడ్డుకోవాలని, ప్రభుత్వం వ్యాపారుల దోపిడీ వ్యవస్థకు చెక్ పెట్టి, గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.




Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed