మొగులయ్యను సన్మానించిన సుప్రీం కోర్టు చీఫ్

by Disha Web Desk 13 |
మొగులయ్యను సన్మానించిన సుప్రీం కోర్టు చీఫ్
X

దిశ, అచ్చంపేట: తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్న కిన్నెర వాయిద్యం, జానపద కళాకారుడు దర్శనం మొగులయ్యను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ సన్మానించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మొగులయ్యకు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ.. కిన్నెర వాయిద్యం, కుటుంబ నేపథ్యం తదితర అంశాలను మొగులయ్య ద్వారా ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

కిన్నెరను ఆడించే ప్రయత్నం చేసిన సుప్రీంకోర్టు చీఫ్..


మొగులయ్య కిన్నెరను ఆడించి పాటను పాడారు. దీంతో ఆనందం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ...మొగులయ్య కిన్నెరను చేతిలోకి తీసుకొని ఆసక్తి గమనించి, కిన్నెరను ఆడించే ప్రయత్నం చేశారు. కిన్నెర తయారు చేసే విధానం, కిన్నెరపై ఉన్న చిలుక బొమ్మ గురించి అడిగి తెలుసుకున్నారు.

సుప్రీం కోర్టు చీఫ్ తన కుటుంబ సభ్యులకు మొగులయ్యను పరిచయం చేయించారు. గ్రామీణ ప్రాంతం కళాకారుడైన మొగులయ్యకు దేశంలోని అత్యున్నత పద్మశ్రీ పురస్కారం రావడం కళకు మరింత గుర్తింపు వచ్చిందని చీఫ్ జస్టిస్ రమణ పేర్కొన్నారు. ఈ కళ ఇంతటితో ఆగిపోకుండా మరింత మందికి కళను నేర్పించి.. బతికించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.



Next Story